ఈసారి ‘డాడీ కూల్’గా ధావన్..!
న్యూఢిల్లీ: ఇటీవల టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. భార్య అయేషాతో కలిసి ఓ బాలీవుడ్ సాంగ్ రీక్రియేట్ చేశాడు. ‘ధాల్ గాయ దిన్, హో గయీ షామ్’ అంటూ భార్యతో కలిసి సరికొత్తగా అలరించాడు. ఇప్పుడు మరో వీడియోతో ముందుకొచ్చాడు శిఖర్ . కుమారుడు జొరావర్తో కలిసి డ్యాన్స్ చేశాడు. పాపులర్ బాలీవుడ్ పాటైన ‘డాడీ కూల్’కు జొరావర్తో చిందులేయించాడు. వివిధ రకాలైన యాక్టివిటీలతో ఎప్పుడూ బిజీగా ఉండే ధావన్.. లాక్డౌన్ కారణంగా వచ్చిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికి కేటాయించాడు. ఈ క్రమంలోనే జొరావర్తో చేసిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. పూర్తి వైట్ డ్రెస్లో కనిపించిన ధావన్.. తలపాగా కట్టడమే కాకుండా నడుంనకు ఒక వస్త్రాన్ని కట్టి మరీ చిందులేశాడు. (ఏయ్ కోహ్లి.. చౌకా మార్!)
ఇక కొడుకు జొరావర్ అయితే కళ్లకు నల్లటి అద్దాలు పెట్టడమే కాకుండా భిన్నమైన హెయిర్ స్టైల్లో దర్శనమిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు దుస్తులను ఉతికిన వీడియోను ఒకటి పోస్ట్ చేశాడు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్డౌన్తో ధావన్ తనలోని సృజనాత్మకతను బయటకు తీస్తున్నాడు. ఈ వైరస్తో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడటంతో ధావన్కు ఇప్పట్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే అవసరం లేదు. మరి డ్యాన్స్ ప్రాక్టీస్తో కొత్త స్టెప్పులను కనిపెడతాడేమో చూడాలి.
కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 వ సీజన్ వాయిదాలు పడుతూ వస్తోంది. మార్చి 29వ తేదీన ప్రారంభం కావాల్సిన ఈ లీగ్ తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా పడగా, ఆపై నిరవధిక వాయిదా పడింది. దాంతో ఐపీఎల్ జరుగుతుందనే క్లారిటీ ఇప్పటికీ రాలేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పెద్దలు చెప్పిన మాటల్ని బట్టి, పూర్తి స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జరిగిన తర్వాతే జరిపిస్తామని తేల్చిచెప్పేశారు. దాంతో ఇప్పట్లో ఐపీఎల్ లేదనేది అర్థమైంది. మరొకవైపు ఐపీఎల్ ఈ ఏడాది జరగదనే వాదన కూడా ఉంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత జరిపించాలన్నా అప్పటికే వేరే టోర్నీలో షెడ్యూల్ అయి ఉంటాయి కాబట్టి ఐపీఎల్ జరగదని అంటున్నారు.
సంబంధిత వార్తలు