కోహ్లి తర్వాత ధావనే..
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ నమోదు చేశాడు. 99 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(5) నిరాశపరిచినప్పటికీ, ధావన్ సమయోచితంగా ఆడి సెంచరీ చేశాడు. ఇది ధావన్ వన్డే కెరీర్లో 13 సెంచరీ. కాగా, అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లలో కోహ్లి తర్వాత ధావన్ నిలిచాడు. కోహ్లి 13 వన్డే సెంచరీలు చేయడానికి 86 ఇన్నింగ్స్లు అవసరం కాగా, ధావన్ 99 ఇన్నింగ్స్ ల్లో ఈ మార్కును చేరాడు. ఓవరాల్గా 13 వన్డే సెంచరీలను వేగవంతంగా చేసిన ఆటగాళ్ల జాబితాలో ధావన్ నాల్గో స్థానంలో నిలిచాడు.
నాల్గో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి(75) రెండో వికెట్గా పెవిలియన్ చేరిన కాసేపటికి ధావన్ సెంచరీ మార్కును చేరాడు. ఈ రోజు మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. దాంతో భారత్ ఇన్నింగ్స్ను రోహిత్-ధావన్లు ఆరంభించారు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్కు చేరినా ధావన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడాడు. గత రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన ధావన్.. నాల్గో వన్డేలో మాత్రం అర్ధ శతకాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. అతనికి కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ జోడి 158 పరుగుల జోడించిన తర్వాత కోహ్లి రెండో వికెట్గా అవుటయ్యాడు. భారత జట్టు 34. 2 ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 200 పరుగుల వద్ద ఉండగా బ్యాడ్లైట్ కారణంగా మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు