2028 ఒలింపిక్స్లో క్రికెట్?
దుబాయ్: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తమ కసరత్తులను ముమ్మరం చేసింది. ఇప్పటికే క్రికెట్ను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడంపై చర్చలు జరిపిన ఐసీసీ.. దానికి సంబంధించి కార్యచరణను వేగవంతం చేసింది. ఈ మేరకు మెరిల్బోన్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) సమావేశంలో చర్చించారు. దీనిపై ఎంసీసీ చైర్మన్ మైక్ గాటింగ్ మాట్లాడుతూ. 2028లో క్రికెట్ను ఒలింపిక్స్లో చూస్తామని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్నేతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాబోవు 18 నెలల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఒలింపిక్స్కు ఎలా అర్హత పొందాలి అనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు గాటింగ్ పేర్కొన్నారు. ఇటీవల అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) అనుబంధ.. జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) పరిధిలోకి బీసీసీఐ రావడం కూడా ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశానికి మార్గం సుగమమైంది. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అన్ని క్రీడా సమాఖ్యలు వాడా పరిధిలోకి రావాల్సి ఉంటుంది.