పుజారా దురదృష్టవంతుడు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతన కాంట్రాక్టును సవరించి, వేతనాలను పెంచాలని విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిలతో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారాను ప్రశంసింస్తూనే అతడు నిజంగానే దురదృష్టవంతుడని వ్యాఖ్యానించాడు.
'విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, అశ్విన్, రహానే, మురళీ విజయ్లతో కలిసి పుజారా వార్షిక కాంట్రాక్ట్ టాప్ గ్రేడ్లో ఉన్నాడు. పుజారా లాంటి నాణ్యమైన ఆటగాడు టాప్ గ్రేడ్లో ఉండటమే న్యాయం. ఎక్కువ మ్యాచ్లు ఆడటంతో పాటు అత్యుత్తమంగా రాణించే వారికి టాప్ గ్రేడ్ దక్కుతుంది. ఐతే టెస్ట్ క్రికెట్లోనే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. పుజారా బ్యాటుతోనే సమాధానం చెబుతున్నాడు. ఐపీఎల్ లాంటి పొట్టిఫార్మాట్లో అతడికి కాంట్రాక్ట్ లేదు. ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం నిజంగా పుజారా దురదృష్టం. తాజా, మాజీ కెప్టెన్లు కోహ్లీ, ధోనీలు ఎంతో సమన్వయంతో ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ధోనీ సహనాన్ని కోల్పోవడం నేనెప్పుడూ చూడలేదు. ఒకవేళ ధోనీకి కోపం వచ్చిన 10 సెకన్లలోపే కూల్ అయిపోతాడని' కోచ్ రవిశాస్త్రి వివరించాడు.
రవిశాస్త్రి చెప్పింది అక్షరాలా నిజమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అద్బుతమైన టెక్నిక్ ఉన్న ఆటగాడైన పుజారాను కేవలం టెస్టులకే పరిమితం చేస్తుండటంతో ఐపీఎల్ లాంటి కీలక టోర్నీల్లో అవకాశాలు రావడం లేదు. భారత ఆటగాళ్లు, భారత్-ఏతో పాటు రంజీ క్రికెటర్లు కూడా హాయిగా ఐపీఎల్ లో ఏదో ఓ జట్టుకు ఆడుతుంటే.. అదే సమయంలో పుజరా లాంటి ఆటగాడు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి దేశాల కౌంటీ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు