26 బంతుల్లో సెంచరీ
ఫైసలాబాద్:ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజమ్ 26 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అది కూడా టీ10 మ్యాచ్లో కావడం ఇక్కడ విశేషం. షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్(ఎస్ఏఎఫ్) చారిటీ మ్యాచ్లో భాగంగా ఎస్ఏఎఫ్ గ్రీన్ తరపున బరిలోకి దిగిన బాబర్ అజమ్ 26 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకపడిన బాబార్ 11 సిక్సర్లు, 7 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎస్ఏఎఫ్ రెడ్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అజమ్ ఈ ఫీట్ సాధించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఏఎఫ్ రెడ్స్ 10 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్నిఛేదించే క్రమంలో ఎస్ఏఎఫ్ గ్రీన్ దీటుగా బదులిచ్చింది. ఓపెనర్గా బరిలోకి దిగిన అజమ్ ఆది నుంచి ఎస్ఏఎఫ్ రెడ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.దాంతో ఎస్ఏఎఫ్ గ్రీన్ ఐదు ఓవర్లలో 100కు పైగా పరుగులు చేసింది. అదే ఊపును కడవరకూ కొనసాగించడంతో ఎస్ఏఎఫ్ గ్రీన్ అవలీలగా విజయాన్ని అందుకుంది. ఇక చివర్లో షాహిద్ ఆఫ్రిది బౌండరీ కొట్టి తన జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు