విరాట్ సేన ఓటమి
గువాహటి: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ 20లో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్ కు 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిన విరాట్ సేన దాన్ని కాపాడుకోవడంలో విఫలమై పరాజయం చవిచూసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(2), అరోన్ ఫించ్(8) వికెట్లను ఆదిలోనే తీసి పైచేయి సాధించినట్లు కనబడిన టీమిండియా.. ఆ తరువాత వికెట్ల వేటలో చతికిలబడింది. ఆసీస్ ఆటగాళ్లు హెన్రిక్స్(62 నాటౌట్;46 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు), ట్రావిస్ హెడ్(48 నాటౌట్; 34 బంతుల్లో 5 ఫోర్లు , 1సిక్స్)లు మరో వికెట్ పడకుండా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. తద్వారా మూడు టీ 20ల సిరీస్ ను ఆసీస్1-1 తో సమం చేసింది. ఇక సిరీస్ నిర్ణయాత్మక మూడో టీ 20 హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరుగనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆది నుంచి తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించింది. భారత జట్టులో ఏ ఒక్కరూ ఆకట్టుకోలేక పోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. తొలుత 27 పరుగులకే కష్టాల్లో పడిన టీమిండియాను కేదర్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి ఐదో వికెట్ 33 పరుగుల జత చేసి కొద్దిగా ఊరట చేకూర్చారు. కాగా, ధోని(13), జాదవ్(27)లు ఓవర్ వ్యవధిలో ఆడమ్ జంపా బౌలింగ్ లో అవుట్ కావడంతో భారత్ 67 పరుగుల వద్ద ఆరో వికెట్ ను నష్టపోయింది. ఆపై భువనేశ్వర్ కుమార్(1) నిష్క్రమించాడు. దాంతో భారత్ జట్టు వంద పరుగుల మార్కును చేరడానికి అపోసోపాలు పడింది. కాగా, హార్దక్ పాండ్యా(25), కుల్దీప్ యాదవ్(16) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆసీస్ బౌలర్లలో పేసర్ జాసన్ బెహ్రెన్ డార్ఫ్ నాలుగు వికెట్లతో రాణించగా, స్పిన్నర్ ఆడమ్ జంపా రెండు వికెట్లు తీశాడు. కౌల్టర్ నైల్, స్టోనిస్, ఆండ్రూ టైలు తలో వికెట్ తీశారు.
మరిన్ని వార్తలు