ఐపీఎల్ వేలానికి 1,122 మంది క్రికెటర్లు
న్యూఢిల్లీ: కాసులు కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో భాగమయ్యేందుకు అన్ని దేశాల క్రికెటర్లు ఉత్సుకత చూపిస్తున్నారు. 2018 సీజన్కు సంబంధించి ఆటగాళ్ల వేలానికి ఏకంగా 1,122 మంది క్రికెటర్లు పేర్లను నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి మొదలుకొని అమెరికా దాకా ఆటగాళ్లు తమ ఎంట్రీలను ఖరారు చేశారు.
బెంగళూరులో ఈనెల 27, 28 తేదీల్లో వేలం కార్యక్రమం జరుగుతుంది. ఫ్రాంచైజీలకు పంపించిన క్రికెటర్ల జాబితాలో జాతీయ జట్లకు ఆడిన వారు 281 మంది... ఆడని వారు 838 మంది ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. భారత్ నుంచి అత్యధికంగా 778 ఎంట్రీలున్నాయి. ఇటీవలే ఎనిమిది ఫ్రాంచైజీలు మొత్తం 18 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి.