కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది

Woman Goes to Doctor Thinking She h్‌as Kidney Stones But Gives Birth to Triplets - Sakshi

వినడానికి, చదవడానికి, నమ్మశక్యంగా లేని వార్త ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన దక్షిణ డకోటాలో ఈ నెల 10న చోటు చేసుకుంది. వివరాలు.. గిల్ట్జ్‌(34) అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడసాగింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గిల్ట్జ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతి అని తేల్చారు. అంతేకాక ఆమె కడుపులో కవలలు లేదా ముగ్గురు పిల్లలు పెరుగుతున్నట్లు గుర్తించారు. గిల్ట్జ్‌ బాధపడుతుంది కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిన నొప్పితో కాదని ప్రసవ వేదనతో అని పేర్కొన్నారు. అనంతరం 4 నిమిషాల వ్యవధిలో గిల్ట్జ్‌ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. చిన్నారులంతా 1.8కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘ఎటువంటి ఆపరేషన్లు లేకుండా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరిగే సంఘటన. డెలివరీ సమయానికి గిల్ట్జ్‌ 34 వారాల గర్భంతో ఉన్నారు. కానీ దాని గురించి ఆమెకు ఏమాత్రం అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. వైద్యుడిని అయినప్పటికి సాధరణ జనాల మాదిరిగానే నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఓ మహిళకు తాను గర్భవతిని అని తెలియకపోవడం.. నిజంగా వింతే. ఎందుకంటే గర్భవతి అయ్యాక నెలసరి ఆగిపోతుంది.. బిడ్డ పెరుగుతున్న కొద్ది ఉదర భాగం ముందుకు వస్తుంది. అంతేకాక ఆరు, ఏడో నెల నుంచి కడుపులో బిడ్డ కదలిక తెలుస్తుంది. కానీ గిల్ట్జ్‌ విషయంలో ఇవేవి జరగకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇప్పటికి నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కిడ్నీలో రాళ్లు అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ ఏకంగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ వార్త చదివిన జనాలు కూడా సదరు వైద్యులు వ్యక్తం చేసిన అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు. గిల్ట్జ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఓ అమ్మాయికి, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top