చెట్టంత కొడుకుని కోల్పోయామయ్యా
నెల్లూరు (సెంట్రల్): ‘అయ్యా.. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. దీన్ని అర్థం చేసుకుని మా కుమారుడు అంకమరావు (18) చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివాడు. ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్తో చదవాలని ఇంజినీరింగ్లో చేరాడు. ఆ డబ్బులు రాకపోవడంతో కళాశాల ఫీజు కట్టలేక, మమ్మల్ని అడగలేక మనస్థాపంతో రెండు సంవత్సరాల కిత్రం ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ వరమ్మ, గోపాల్ వైఎస్ జగన్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. స్కాలర్షిప్ అంది ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదుకోవాలయ్యా
‘అయ్యా.. నా రెండు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్స చేయించుకునే స్థోమత లేదు. మందులకే నెలకు కనీసం రూ. 10 వేలకు పైగా ఖర్చు అవుతోంది. కూలి చేసుకుని పొట్ట నింపుకునేవాళ్లం. మీరే ఆదుకోవాలి’ అని కృష్ణారెడ్డిపల్లికి చెందిన షేక్ మస్తాన్ వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి విన్నవించాడు. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్నాడు. ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.