‘ఆయనా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది’
వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసిన కాంగ్రెస్తో చంద్రబాబు కలవడం దారుణమన్నారు. మరోసారి చంద్రబాబు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని మండిపడ్డారు. తమ అధినేత వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నంపై సీఎం అవహేళనగా మాట్లాడారని, ఈ ఘటన నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ హత్యాయత్నాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారన్నారు.
చంద్రబాబు ఏనాడు ఒంటరిగా పోటీచేసి గెలవలేదని, రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకుని, మళ్లీ ప్రజాస్వామ్యం, దేశం కాపాడటం కోసమని బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్తో కలవడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమి లేదని, 2006లో వెలిగొండ ప్రాజెక్ట్ను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ఆ మహానేత హయంలోనే దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. చంద్రబాబును ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేసి, ప్రకాశం జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరిస్తామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవంతో దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, చంద్రబాబు మాత్రం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు.