ప్రతి పథకంలో దోపిడీ: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రతి సంక్షేమ పథకంలో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రతి అవినీతిని అడ్డుకుంటామని వైవీ స్పష్టం చేశారు. ప్రభుత్వం అవినీతి అడ్డుకుంటే మేం రాక్షసులమా అని ప్రశ్నించారు. దోపిడిని ఆపాలనే అడ్డుపడుతున్నామని అన్నారు. ఉపాధి హామీ నిధుల్లో భారీ అవినీతి జరుగుతోందని, సాక్షాత్తు కేంద్రమే నిధుల దుర్వినియోగం గురించి చెప్పిందని వివరించారు.
ప్రభుత్వ అవినీతిని అడ్డుకుంటున్నందుకే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని విమర్శించారు. ఉపాధి హామీ నిధుల అమలును కాగ్ రిపోర్టు తప్పు పట్టిందని వైవీ గుర్తుచేశారు. ఉపాధి హామీ పనులు, నిధుల్లో అవకతవకలు జరిగాయనడానికి తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, చంద్రబాబునాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పేదలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి నిధులను, పచ్చచొక్కాలకు మాత్రమే లబ్థి చేకూరేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వైవీ విమర్శించారు. పేదల కడుపు కొట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంటే అభివృద్ధి నిరోధకులు అంటూ వైఎస్సార్సీపీపై బురద చల్లుతారా అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.