‘చంద్రబాబు చిత్తశుద్ధితో పెన్షన్లు పెంచలేదు’
సాక్షి, కాకినాడ : మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడం కోసమే పెన్షన్లు పెంచారు తప్ప చిత్తశుద్దితో కాదని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా సంకల్పయాత్ర ద్వారా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటీ ఇరవై లక్షల మందిని ప్రత్యేక్షంగా కలిసి సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు.
పాదయాత్ర ద్వారా ప్రజల్లో మనోద్యైర్యాన్ని నింపి భరోసా ఇచ్చారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు ప్రజలు విసిగిపోయారని, అందుకే జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు అడ్డుకుంటున్నారని చెప్పారు. నవరత్నాలను ప్రజల గుండెలకు హత్తుకునేలా తెలియజేయాలని వైఎస్సార్సీపీ బూత్ కమిటీ సభ్యులకు సూచించారు.