టీడీపీ దోపిడీకి కొవ్వూరు ఉదాహరణ : వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ప.గో జిల్లా : టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పాలనకు కొవ్వూరు నియోజకవర్గం ఉదాహరణ అని ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. నియోజక వర్గ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు దోచిన డబ్బంతా ఎక్కడుందో మోదీకి తెలుసు అందుకే అక్కడే దాడులు చేస్తున్నారని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను అడ్డుపెట్టుకుని ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం భావ్యం కాదంటూ విమర్శించారు. ఈ నాలుగున్నర ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై పోరాటం చేసి ఉంటే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు. పద్నాలుగు నెలలు పదవీకాలం ఉండగానే రాష్ట్రం కోసం తాము రాజీనామాలు చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని తెలిపారు.
టీడీపీ చేస్తున్న దోపిడీ పాలనలో ఇసుక, మద్యం పేరిట కోట్లాది రూపాయలను నాయకులు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి 5 లక్షల వరకు లబ్దిచేకూరుతుందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చేది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమేనని స్పష్టం చేశారు.