చంద్రబాబు వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కేంద్రానికి లేఖలు రాయడం వల్లే ఉపాధి హామీ నిధులు నిలిచిపోయాయన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైవీ సుబ్బారెడ్డి గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘టీడీపీ చేస్తోంది ముమ్మాటికీ గ్లోబల్ ప్రచారమే. అవకతవకలు జరిగిన ప్రాంతాల్లో తప్ప నిధులు ఎక్కడా నిలిచిపోలేదు. ఈ ఆరు నెలలకు కూడా కేంద్రం ఉపాధి హామీ నిధులు విడుదల చేసింది. ప్రధాని కార్యాలయం నుంచి ఏపీలో ఉపాధి అవకతవకలపై విచారణ కమిటీ వేయడంతో చంద్రబాబు కంగుతిన్నారు.
టీడీపీపై పడిన బురదను కడుక్కోకుండా వైఎస్ఆర్ సీపీపై బురద జల్లే కార్యక్రమం చేయడం దారుణం. దమ్ముంటే చర్చకు రండి. ఏ వేదిక మీదైనా చర్చకు మేం సిద్ధం. పేదలకు దక్కాల్సిన ఉపాధి నిధులు పచ్చ చొక్కాలు బుక్కేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఈ అవకతవకలపై సీబీఐ విచారణకైనా మేం సిద్ధం. కేంద్రానికి లేఖలు రాసిన వాళ్లలో టీడీపీ మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారు. మొత్తం 14 లేఖలు వెళ్లాయి. నిజాలు కప్పిపుచ్చి టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది.’ అని ధ్వజమెత్తారు.