‘40 వేల మందిని బాబు వంచించాడు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్లో ఛలోక్తులు విసురుతూ తనదైన శైలిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామంటూ నాయుడు బాబు తాను ఇచ్చిన హామీకి మంగళం పాడేశారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లపాటు కమిటీలు, ఉపసంఘాలు అని మభ్యపెట్టి 40 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను దారుణంగా వంచించారని తూర్పారబట్టారు.
అలాగే ఏపీ నూతన రాజధాని అమరావతి డిజైన్ల విషయంలో చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ అసెంబ్లీ భవనం డిజైన్ ఇడ్లీ స్టాండ్లా కనిపిస్తోందని విమర్శలు రావడంతో దానిని బోర్లించిన లిల్లీ ఆకృతిలోకి మార్చారంట. నాయుడు బాబు చెబుతున్న నయా తాజ్మహల్ ఇదేనేమో. తాజ్ని తలదన్నేలా కట్టినా తాజ్ చారిత్రక విశిష్టతను ఏదీ అధిగమించలేదన్న ఇంగితం లేదాయె! ’ అంటూ చంద్రబాబు నుద్దేశించి తీవ్రంగా ధ్వజమెత్తారు.