పవన్ కల్యాణ్.. మందలగిరి మాలోకాన్ని మించిపోయారు
ట్విటర్లో ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్స్
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో ఎవరి తరఫున ఉండాలో పవన్ కల్యాణ్కే స్పష్టత లేదని విమర్శించారు. ‘ఏ గట్టున ఉంటారో ఆయనకే తెలియదు. ఏ రోటికాడ ఆ పాట పాడేస్తున్నారు పవన్. ఆంధ్రా వాళ్ళను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతారు. తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్రా వాళ్ళకు చుక్కలు చూపించేవాడినని ఈ గట్టున నిలబడి జబ్బులు చరుస్తారు. గందరగోళంలో మందలగిరి మాలోకాన్ని మించిపోయారు కదా!’ అని సెటైరిక్గా ట్వీట్ చేశారు.
ముసుగులో గుద్దులాట ఎందుకు?
కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబు, పవన్కు వైఎస్ జగనే కనిపిస్తున్నారని, ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికి ప్రయాసపడి నటిస్తున్నారని పవన్ ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ను తిట్టకపోతే ప్యాకేజీకి బాబు కోతలు పెడతారాన్న భయం కాబోలేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకని, ముసుగులు కప్పుకునేది విలన్లని, హీరోలు కాదు కదా? అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఆంధ్రప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, వారిని కొడుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. అదే తెలంగాణలో నిన్న(గురువారం) ఎల్బీస్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపేవాడినన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్ అసలేం మాట్లాడుతున్నారని ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ వచ్చినందుకు ఆనందించిన వ్యక్తుల్లో తానే మొట్టమొదటి వ్యక్తినన్న పవన్.. గతంలో తెలంగాణ వచ్చినందుకు పది రోజులు అన్నం తినకుండా ఉన్నానని కూడా అన్నారు. ఇలా రెండు రకాల మాటలతో జనసేనాని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రజలు బిత్తరపోతున్నారు.