ఆరు నెలలపాటు ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్
పాదయాత్రలో నాలుగు పాయింట్లపై ప్రధాన దృష్టి
పాదయాత్రలో సుమారు 2కోట్ల మందిని కలవనున్న వైఎస్ జగన్
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పాదయాత్రలో సంతకాల సేకరణ
మొదట 4 నెలల్లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలాగానే ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. 5కోట్ల మంది భవిష్యత్ కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. నవంబర్ 6 నుంచి మొదలై దాదాపు ఆరు నెలల పాటు కొనసాగుతుందని చెప్పారు.
ఎంపీ మేకపాటి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజాహిత కార్యక్రమాలు అమలు అవుతాయన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, నవంబర్ 6 నుంచి వైఎస్ జగన్ చేపట్టే పాదయాత్రలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సంతకాల సేకరణ జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అన్నిరకాలుగా అభివృద్ధి చెందుతుందని, హోదా విషయంలో 5కోట్ల మంది హక్కును చంద్రబాబు కాలరాశారని అన్నారు.
‘నవంబర్ 6 నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. 45 లక్షలమంది కుటుంబాల్లో సుమారు 2కోట్లమందిని వైఎస్ జగన్ కలుస్తారు. 20వేలమందికి పైగా కార్యకర్తలతో భేటీ అవుతారు. 10వేలకు పైగా గ్రామాల్లోని జనంతో మమేకం అవుతారు. 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుంది. దాదాపు 5వేలకు పైగా దారి వెంబడి 125 రోజులు రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి. రచ్చబండలో ప్రత్యేక హోదా కోరుతూ సంతకాల సేకరణ ఉంటుంది. మొదట నాలుగు నెలల్లో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రామలు ఉంటాయి. అలాగే హామీల అమలుపై రచ్చబండలో చర్చతో పాటు పల్లెల్లో ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకుంటాం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎన్నికలు మా మేనిఫెస్టో. పాదయాత్ర జరిగే తీరు 2019 ఎన్నికల లక్ష్యంగా ప్రణాళిక. అందుకనే ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర. బెటర్ ఆంధ్రప్రదేశే లక్ష్యమని వైఎస్ జగన్ చెప్పారు. వచ్చే నెల 6న ఇడుపులపాయలో ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.’ అని వారు తెలిపారు.