స్పీకర్ను కలిసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. తమ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్య తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వంతల రాజేశ్వరి ఈ నెల 4న టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు స్వయంగా టీడీపీ కండువా వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.
కాగా, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని విపక్ష సభ్యులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఇంతకుముందు విమర్శించారు. దేశంలో ప్రతిపక్ష సభ్యులతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదేనని ఆయన దుయ్యబట్టారు.