బాబుకు ఎమ్మెల్యే రోజా సూటి ప్రశ్న
రాజమహేంద్రవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ‘చంద్రబాబు ఎక్స్పైర్ అయిన ట్లాబ్లెట్ లాంటివారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం చచ్చిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను దొంగిలిస్తున్న చంద్రబాబుకు వాటిని అమలు చేసే మనసుందా అని ప్రశ్నించారు. ఇంతటి అసమర్థ సీఎంతో ప్రజలకు ఉపయోగం ఉండదని అన్నారు. దివాన్ చెరువులో మంగళవారం జరిగిన ‘మహిళా స్వరం’ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు స్మార్ట్గా మహిళలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలను మోసం చేసిన చంద్రబాబు మహిళా ద్రోహి అని మండిపడ్డారు.
‘చంద్రబాబుకు పసుపు కుంకుమ విలువ తెలుసా. తన తల్లి అమ్మణ్నమ్మ ఆస్తిని ఆడపచులకు కాకుండా కొడుకు లోకేష్కు ఇచ్చుకున్నారు. ఎన్నికల్లో 600 హామిలిచ్చిన ఆయన ఒక్కటైనా అమలు చేశారా. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం పేరిట రూ.30 వేలు అందిస్తామని చెప్పారు. నేటి వరకు ఒక్కరికీ ఇవ్వలేదు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదా’ అని సూటిగా ప్రశ్నించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తానని చెప్పిన బాబు.. తన కోడల్ని మాత్రమే పారిశ్రామిక వేత్తను చేశారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు అన్న వైఎస్ జగన్కే దక్కాలి అని ఆకాక్షించారు. మహిళలు అబలలు కాదు సబలలు అని నిరూపించాలని పిలుపునిచ్చారు.