గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీకి 20 స్థానాలు
సాక్షి, పశ్చిమగోదావరి : 2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20కు పైగా సీట్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ అన్నారు. దీనికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చిన స్పందనే నిదర్శనమన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలోని 13 జిల్లాల్లో వైఎస్ జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. రాష్ట్రంలో వందకు పైగా స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తామన్నారు. అబద్దపు హామీలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ది చెప్పాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
నాటి పాదయాత్రను మించి..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు మించి వైఎస్ జగన్ పాదయాత్రకు ఘనస్వాగతం పలకబోతున్నామని వైఎస్సార్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్ రాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో జననేత వైఎస్ జగన్ పాదయాత్ర ఒకటి మించి మరొకటి అన్నట్లుగా సాగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమలో 15 స్థానాలు గెలుస్తామన్నారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి ద్వారానే వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని స్పష్టం చేశారు. నాడు వైఎస్ఆర్ నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్తో ప్రజాసంకల్పయాత్రలో కలిసి అడుగులు వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.