అవినీతి పాలనకు చరమగీతం
నవరత్నాలతోనే స్వర్ణయుగం
ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి
బూత్ కమిటీలతో పార్టీ బలోపేతం
మిడుతూరు సభలో వైఎస్సార్సీపీ నేతలు
కర్నూలు , మిడుతూరు: రాష్ట్రంలో అవినీతిపాలనకు చరమగీతం పాడదామని వైఎస్సార్సీపీ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి , నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. మంగళవారం మండలకేంద్రమైన మిడుతూరులో జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌతంరెడ్డి, శిల్పా, ఐజయ్యతో పాటు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి హాజరయ్యారు. ముందుగా స్థానిక వీరబ్రహ్మేంద్ర మఠం నుంచి అశేషజనవాహినితోర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారన్నారు. జగనన్న ప్రకటించిన నవరత్నాలతోనే స్వర్ణయుగం వస్తుందన్నారు. నందికొట్కూరు స్థానంలో వైఎస్సార్సీపీని గెలిపించి.. జగనన్నకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలుసుకునేందుకే..
జగనన్న ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలుసుకునేందుకే రేయనక, పగలనక ప్రజాసంకల్పయాత్ర చేపడుతున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఉల్లి రైతులు ఉరి వేసుకునే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకోని దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదింపుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
సాగునీరు ఇచ్చింది వైఎస్సారే..
ప్రాజెక్టులకు రూపకల్పన చేసి రాయలసీమకు సాగునీరందించి సస్యశామలం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి యువతను వంచించారన్నారు. ఇన్నాళ్లూ నిరుద్యోగ భృతిని గాలికొదిలేసి .. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వెయ్యి రూపాయలు ఇస్తామని మభ్యపెడుతున్నారన్నారు. నీరు–చెట్టు, ఇసుక, సీసీ రోడ్లు, అమరావతి తదితర పనుల్లో సంపాదించిన అవినీతిసొమ్ము ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
మడమ తిప్పని నేత జగనన్న
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగనన్న కావాలా? అబద్ధాలకోరు.. మోసం చేసే నాయకుడు చంద్రబాబు కావాలా? అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రజలను ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు, 108, 104, ఆరోగ్యశ్రీ తదితర బృహత్తర పథకాలు అమలు చేశారని కొనియాడారు. సంక్షేమ ఫలాలు ప్రతి పేదోడి ఇంటికి చేరా యన్నారు. అన్ని వర్గాల ప్రజలను వంచించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అమరావతి పేరు మీద అంతర్జాతీయ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలంతా జగనన్న వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ లోకేశ్వరరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకులు పోచా జగదీశ్వరరరెడ్డి, చెరుకుచెర్ల రఘురామయ్య, తోట కృష్ణారెడ్డి, రైతు నాయకులు వంగాల సిద్ధారెడ్డి, జనార్ధన్రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు చంద్రమౌళి, నాయకులు గోవర్ధన్రెడ్డి, పెద్ద పుల్లారెడ్డి, పేరెడ్డి నారాయణరెడ్డి, వనం వెంకటరెడ్డి, పెద్ద పుల్లారెడ్డి, చిన్న మల్లారెడ్డి, నాగిరెడ్డి, శేషిరెడ్డి, గుల్జార్, షరీఫ్, జయరామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, దాసి సుధాకర్రెడ్డి, మల్లు శివనాగిరెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
49– బన్నూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ జగన్మోహన్రెడ్డితో పాటు దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. అదేవిధంగా పీరుసాహెబ్ పేట గోపాల్రెడ్డి, జగదీశ్వరరెడ్డి, నాగిరెడ్డి, తపాల చంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, చంద్రారెడ్డి, కడుమూరు శంకర్రెడ్డి, హిదాయత్, చౌట్కూరు గోపాల్రెడ్డి, తువ్వా అయ్యపురెడ్డి, తువ్వా రామనాగేశ్వరరెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నాయకులు కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.