వైఎస్సార్సీపీ ముఖ్య సమావేశం రేపు
హైదరాబాద్ రావి నారాయణరెడ్డి హాలులో నిర్వహణ
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ముఖ్య సమావేశం ఈ నెల 26వ తేదీన జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన ఈ మేరకు జిల్లా పార్టీ నేతలకు ఒక లేఖను పంపారు. గురువారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని లోటస్పాండ్ వద్ద గల రావి నారాయణరెడ్డి సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహిస్తారని ఆయన తెలిపారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆహ్వానితులుగా ఉంటారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఈ నెల 11వ తేదీన జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాదయాత్ర జరుగుతున్న జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో చేపట్టాల్సిన పార్టీ కార్యాచరణపై నేతలిచ్చిన సలహాలు, సూచనలు ఆధారంగా రాబోయే ఆరు నెలల పార్టీ కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. 26న జరిగే సమావేశంలో వైఎస్ జగన్ పార్టీ కార్యక్రమాలపై నిర్దేశిస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎంతో ప్రాధాన్యమున్న ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.