వైఎస్ఆర్సీపీ అభిమానులకు విజ్ఞప్తి
వైఎస్ జగన్ పేరు మార్పు అంటూ అసత్యవార్త
ఖండించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 6న, వైఎస్ఆర్ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రకటించాయి.
అయితే తాజాగా ప్రజాసంకల్ప యాత్ర కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు మార్చుకున్నారని, పలు తెలుగు మీడియా ఛానెల్స్తో పాటు సోషల్ మీడియాలో వార్త ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు స్పందించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మార్చుకున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించాయి. నిరాధార వార్తలను నమ్మెద్దని ప్రజలతో పాటు, పార్టీ అభిమానులకు పార్టీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. ఇటువంటి అసత్య కథనాలను ప్రసారం చేయొద్దని మీడియాను కోరాయి. ఏదైనా ప్రత్యేక అంశం ఉంటే మీడియా సమావేశం లేదా పత్రికా ప్రకటన ద్వారా పార్టీ శ్రేణులతో పాటు కార్యకర్తలను తెలియచేస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. మరో వైపు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలపై వారు మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఆటంకాలు సృష్టించినా, ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఈనెల 6నుంచి ప్రారంభమౌతుందని స్పష్టం చేశారు.
మరో వైపు ప్రజా సంకల్ప యాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం జగన్మోహన్రెడ్డి, శుక్రవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరతారని ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి వివరించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత తిరుమల పర్యటనను, 6న చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్ప యాత్ర నవంబర్ 6న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమై, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.