రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో తమ ఆందోళన కొనసాగించారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వెల్లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఏఐడీఎంకే సభ్యులు కావేరీ నదిపై ప్రాజెక్టులు కట్టరాదంటూ వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కార్యకలాపాలు స్తంభించిపోవడంతో రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు.