‘వెన్నుపోటు పొడిచేవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు’

YSRCP Leader YV SubbaReddy Criticises Chandrababu Naidu - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు విచారకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవస్త్యంగా ఉందని.. జనాలు సమస్యలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి సభలు జనాలు లేక వెలవెలబోతున్నాయని.. చం‍ద్రబాబు హామీలు శిలాఫలకాలకు పరిమితమయ్యాయే తప్ప అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను మరోసారి మభ్యపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా వెన్నుపోటు పొడిచేవాళ్లకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. (ఫినిష్‌ అయిపోతావ్‌; మహిళకు చంద్రబాబు వార్నింగ్‌)

కాగా జన్మభూమి కార్యాక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం కాకినాడకు వచ్చిన సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ నాయకులను ఆయన బెదిరింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. ‘మాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి’ అంటూ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే బీజేపీ నాయకురాలిని హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top