'ఆ మంత్రికి ఒళ్లు పెరిగింది.. బుద్ధి మాత్రం పెరగలేదు'
టీడీపీ.. ఓ డ్రామాల పార్టీ అన్నది వాస్తవం
వైఎస్ జగన్తో చంద్రబాబుకు పోలికనా?
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు
విలువలు, విశ్వసనీయత కోసం సోనియాని ఎదురించిన వ్యక్తి జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్
సాక్షి, విజయవాడ: అధికార టీడీపీ ఓ డ్రామాల పార్టీ అని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితామంతా వెన్నుపోటు, డ్రామాలు, అవినీతేనంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి ఒళ్లు పెరిగింది.. కండలు పెంచారు.. బుద్ధిమాత్రం పెరగలేదని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడలో జోగి రమేష్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 'బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చంద్రబాబు కోపంతో ఉన్నారు. కూర్చీలోంచి లేచి పడిపోతున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు పగటి వేషగాళ్లలాగ పార్లమెంట్లో కనిపించడం హాస్యాస్పదంగా ఉంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచన మేరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏడాదికిపైగా పదవీ కాలాన్ని ప్రత్యేక హోదా సాధన కోసం తృణప్రాయంగా వదులుకునేందుకు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో టీడీపీ ఎంపీలు మాత్రం పదవులను పట్టుకుని వేలాడుతున్నది వాస్తవం కాదా. చంద్రబాబుకు, వైఎస్ జగన్కు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తించాలి. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు పోయేందుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు. అచ్చెన్నాయుడుకు ఈ విషయాలు తెలియదా. వైఎస్ జగన్ ప్రకటనతో సీఎం చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా కావాలనుకుంటే జగన్ వెంట ప్రయాణించండి. వద్దనుకునేవాళ్లు చంద్రబాబుతో ఉండాలంటూ వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ సూచించారు.