విశాఖకు సముద్రాన్ని తానే తెచ్చానంటారేమో?

ysrcp leader bosta satyanarayana takes on chandrababu over polavaram project - Sakshi

రాష్ట్రానికి నష్టం కలిగించేలా చంద్రబాబు చర్యలు : బొత్స

పోలవరంపై కేంద్రం ఇప్పటికే అభ్యంతరాలు చెప్పింది

ప్రత్యేక హోదాను సొంత ప్రయోజనాలకు బాబు తాకట్టు పెట్టారు

హైదరాబాద్‌ మెట్రోపై చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం

విశాఖకు సముద్రాన్ని తానే తీసుకొచ్చానని చెబుతారేమో?

సాక్షి, విశాఖ : పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అలాంటిది చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చింది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డేనని, భూ సేకరణ మొదలుపెట్టింది కూడా ఆయనేనని అన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు తానే తెచ్చానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స విమర్శించారు. రేపు విశాఖకు సముద్రాన్ని తానే తెచ్చానని కూడా ఆయన చెప్పొచ్చంటూ ఎద్దేవా చేశారు.

గురువారం విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ సీఎం చర్యలు రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉన్నాయి. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. పోలవరాన్ని తామే కడతామని కేంద్రం చెప్పినా సహకరించకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపడింది. ప్రత్యేక హోదాను చంద‍్రబాబు సొంత ప్రయోజనాలకు తాకట్టు పెట్టారు. పోలవరంపై కేంద్రం ఇప్పటికే అభ్యంతరాలు చెప్పింది. కాంట్రాక్టర్లను మారిస్తే నాణ్యత లోపిస్తుందని కేంద్రం చెబుతోంది.

పోలవరం నిర్మాణంలో బాబు అవినీతికి పాల్పడుతున్నారనే ప్రస్తుతం నిధులు ఇవ్వలేమని కేంద్రం అంటోంది.  నిర్మాణ బాధ్యత కేంద్రం నుంచి మీరెందుకు తీసుకున్నారు?. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పాలి. విశాఖకు రైల్వేజోన్‌ ఏమైంది. ప్రత్యేక హోదా ఏమైంది. గిరిజన వర్సిటీ ఏమైంది? మీరిచ్చిన హామీలేమయ్యాయి. జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ప్రతిపక్షం అడిగితే టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. బాబు సర్కార్‌ ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించాలి.’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top