ప్రారంభమైన వైఎస్సార్ఎల్పీ సమావేశం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ
ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
పార్టీలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చ
మంత్రివర్గం కూర్పుపై స్పష్టత ఇచ్చే అవకాశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష (వైఎస్సార్ఎల్పీ) సమావేశం ప్రారంభమైంది. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో 151 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పునకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలనే దానిపై ప్రధానంగా ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని ఈ నెల 8వ తేదీన విస్తరించనున్న నేపథ్యంలో వైఎస్సార్ఎల్పీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 8వ తేదీన 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది.