‘వైఎస్సార్ కుటుంబం’ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమానికి ప్రజల్లో నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను గమనించి పార్టీ ఈ లక్ష్యాన్ని ఒక కోటి కుటుంబాలకు పెంచింది. అంతేకాక, ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఒక సర్క్యులర్ను పంపారు. ఈ సమాచారాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు, జిల్లా పరిశీలకులకు కూడా పంపారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంపై నవంబర్ 1వ తేదీన సమీక్షించి తదుపరి కొన్ని సూచనలు చేస్తామని కూడా ఆయన తెలిపారు.
జగన్ పాదయాత్రపై నేడు వైఎస్సార్సీపీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 2వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్రపై చర్చించడానికి ఈ నెల 11వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం జరగనున్నది. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సమావేశం జగన్ అధ్యక్షతన జరుగుతుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, అన్ని జిల్లాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి కోరారు.