కంచ ఐలయ్యను అరెస్టు చేయాలి
వైఎస్సార్ సీపీ ఏపీ వాణిజ్య విభాగం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆర్య వైశ్యులను కించ పరిచేలా పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని, ఆయన పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ వివాదాస్పద పుస్తకంపై ఆర్యవైశ్యులు తీవ్ర నిరసనలు తెలుపుతున్నా తెలుగు రాష్ట్రాల సీఎంలు పట్టించుకోకపోవడం విచారకరమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆర్యవైశ్యులను సామాజిక స్మగ్లర్లు అని నిందించడమనేది మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఉగ్రవాద చర్య కింద పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా సంక్షేమ కార్యక్రమాల్లో ముందుండే ఆర్యవైశ్యులు నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా, ఏపీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయనకు తమ వర్గంపై ఎంత చిన్నచూపు ఉందో తెలుస్తోందన్నారు. ఆర్యవైశ్యులకు ఐలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.