జగన్కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి : విజయమ్మ
సాక్షి, కందుకూరు(ప్రకాశం) : ‘జగన్కు ఒక్క అవకాశం ఇవ్వండి.. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. మీ ప్రతి అవసరం తీరుస్తాడు.. మీ కోసమే ఉంటాడు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన రోడ్షోలో ఆమె పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాజన్న రాజ్యం గుర్తు తెచ్చుకోండి..
‘మరో 13 రోజుల్లో ఓటేయబోతున్నాం.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోవాలని అందరినీ కోరుతున్నా. నేడు ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్దం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నాను. వైఎస్సార్ ఆశయాల స్పూర్తితోనే వైఎస్సార్సీపీ పుట్టిందని మీ అందరికీ తెలుసు. వైఎస్సార్ కుటుంబానికి, ప్రజలకు మధ్యన 40 ఏళ్ల అనుబంధం ఉంది. వైఎస్సార్లా జగన్ కూడా నిత్యం ప్రజలతోనే ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ సారి అలాంటి పొరపాటుకు తావు లేకుండా చూసుకోవాలి. వైఎస్సార్ లేకపోవడం వల్ల మా కుటుంబానికి వచ్చిన నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఎక్కువ అనిపిస్తోంది. కాంగ్రెస్లో ఉన్నంత కాలం వైఎస్సార్, జగన్ మంచివాళ్లు. కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే.. అన్ని రకాల కేసులు, వేధింపులు మొదలయ్యాయి. మా కుటుంబాన్ని చాలా బాధ పెట్టారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి ఓదార్చాలనుకున్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు.
వైఎస్సార్ బతికున్నంత కాలం ఏనాడు నేను బయటకు రాలేదు. ఆయన మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల నేను జనంలోకి రావాల్సి వచ్చింది. నా బిడ్డ జగన్ను జైల్లో పెట్టారు. నాటి ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల్లోకి వచ్చాను. వైఎస్సార్ బతికున్నంత కాలం ప్రజలే ముఖ్యమనుకున్నారు. జగన్ కూడా ప్రజలే ముఖ్యమని జనంలో ఉన్నారు. 9 ఏళ్ల కాలంలో కుటుంబంతో గడిపింది చాలా తక్కువ. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను.. జగన్ ఏదైనా చెబితే అది చేస్తాడు.. ఏదైనా అనుకుంటే అది సాధిస్తాడు.
వైఎస్సార్.. సీబీఐ దర్యాప్తు వేయించలేదా..?
పరిటాల హత్యకేసులో నా కొడుకుపై ఆరోపణలు చేస్తే కొడుకని కూడా చూడకుండా వైఎస్సార్ సీబీఐ దర్యాప్తు చేయించారు. మరి మీరేందుకు మా మరిది హత్యపై సీబీఐ దర్యాప్తు వేయడం లేదు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగేతే వైఎస్సార్ అక్కడికెళ్లి ఆయనను ఓదార్చారు. దాడిని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. ఈరోజు మా మరిది హత్యకు గురైతే చంద్రబాబు పరవశించిపోతున్నారట.. ఎందుకు పరవశించపోతున్నారని అడుగుతున్నా. ఈ రోజు చంద్రబాబు తాను చేసిన పనిని చెప్పి ఓట్లడిగే పరిస్థితి లేదు. వెలిగొండ ప్రాజెక్ట్ను వైఎస్సార్ హయాంలోనే 70 శాతం పూర్తి చేశారు. చంద్రబాబు మాత్రం పూర్తిచేయలేకపోయారు. మూడు నెలల ముందు చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తున్నారు.
గత రెండేళ్లకు ముందు జగన్ నవరత్నాలు ప్రకటిస్తే చంద్రబాబు నేను చేస్తానని కాపీ కొట్టారు. పులిని చూసి నక్క వాతలుపెట్టుకుందంట. ఎంత వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కే. నవరత్నాలతో జగన్ ప్రజలను ఆదుకుంటారు. జగన్కు ఒక్క చాన్స్ ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకువస్తాడు. కందుకూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహిదర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.