జనం నుంచి జగన్ను వేరు చేయలేరు: విజయమ్మ
ప్రతిపక్షనేతకు ఎయిర్ పోర్ట్లోనే భద్రతలేకపోతే ఎలా?
థర్డ్ పార్టీ ఎంక్వయిరీ వేయడానికి సీఎంకు భయమెందుకు
నా కొడుకును నా నుంచి దూరం చేయకండి
మీడియాతో వైఎస్ విజయమ్మ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్ : నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్ జగన్ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన జగన్పై హత్యాయత్నం జరిగాక హైదరాబాద్లో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో పాదయాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విరామం అనంతరం వైఎస్ జగన్ రేపటి (సోమవారం) నుంచి ప్రజాసంకల్పయాత్రను పునఃప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం, జగన్ క్షేమం కోసం ప్రార్థనలు చేయగలను, కానీ తన కుమారుడికి రాష్ట్ర ప్రజానీకమే భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..
‘వైఎస్ జగన్ పాదయాత్రకు తిరిగి వెళ్తుండగా.. కృతజ్ఞతను, విన్నపాన్ని తెలపాడానికి మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో రుణపడి ఉన్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, తమ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి సన్నిహితుడికి హృదయ పూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. జగన్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్ధించారు.. ప్రేమించారు. వారందరికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.
వైఎస్ జగన్కు ఇది పునర్జన్మ..
మహానేత వైఎస్సార్ను నాయకుడిగా గుర్తించి 30 ఏళ్లు ఆరాధించారు. ఆయన సీఎం అయిన తరువాత ప్రజలందరిని ఆదుకున్నారు. నాన్న ఎప్పుడు నన్ను ఒంటరి చేయలేదని జగన్ అంటూ ఉంటారు. ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు అని చెబుతుంటారు. వైఎస్ జగన్కు ఇది పునర్జన్మ. గొంతులో దిగాల్సిన కత్తి అదృష్టవశాత్తు భుజానికి తగిలింది. ప్రజల ప్రేమ, దీవెనలతోనే ఈ ప్రమాదం నుంచి జగన్ తప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ తొలి ప్లీనరిలోనే నా కొడుకును మీకు అప్పజెప్పుతున్నానని ప్రకటించా. అప్పటి నుంచి ఆయన ప్రజల మధ్యనే ఉన్నాడు. ఓదార్పు యాత్రలో మీరే ఆయనను ఓదార్చారు. ప్రజా సమస్యలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా విషయంలో అనేక పోరాటాలు, దీక్షలు చేశారు. ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర 11 జిల్లాల మీదుగా సుమారు 3200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇది ప్రజా ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది.
మౌనంగా సహిస్తున్నాం. భరిస్తున్నాం...
ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని ఒక పెద్దమనిషి అన్నారు. అప్పుడు నేనేం చేయలేదు. దేవుడిని మాత్రమే ప్రార్ధించాను. గోదావరి జిల్లాలో అంతం చేయాలని రెక్కీ జరిగింది. అక్కడ కుదరకపోవడంతో ఎయిర్పోర్ట్లో ఆ పని చేశారు. ప్రజల మధ్యన ఉంటే సాధ్యం కాదని హత్యాయత్నంకు ప్రజలు లేని ఎయిర్ పోర్ట్ ను ఎంచుకున్నారు. తల్లి, భార్య, చెల్లెలిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. మౌనంగా సహిస్తున్నాం.. భరిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీకి అయితే 30 ఏళ్లు సేవ చేశాడో ఆపార్టీ ఆ మహానేతను దోషిని చేసింది.. ఇప్పటికి వేధిస్తోంది. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని వైఎస్ జగన్పై అన్నిదాడులు చేయించి 16 నెలలు జైలులో పెట్టారు. నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడు ఇన్ని వేధింపులు ఎదుర్కోలేదు. అయినా జగన్ దేనికి చలించలేదు, అదరలేదు. ఈ సమస్యలన్నిటినీ పక్కన పెట్టి ప్రజల మధ్యే ఉండి పోరాడుతున్నారు.
కేసు విచారణ పురోగతి లేదు..
జగన్పై హత్యాయత్నం జరిగి 17 రోజులవుతోంది. అయినా ఈ కేసులో పురోగతి లేకపోగా ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. వైఎస్ జగన్కు అయిన గాయం గురించి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు వెక్కిరిస్తూ మాట్లాడుతున్నారు. విచారణ జరపకుండా రోజుకో మాటతో పబ్బం గడుపుతున్నారు. వీఐపీ లాంజ్లోనే భద్రతా లేకుంటే ఎలా అని అడుగుతున్నా. చిన్న గుండు సూది కూడా తీసుకుపోనివ్వని ఎయిర్పోర్ట్లోకి ఏ విధంగా కత్తులు వెళ్లాయి? ఈ ఘటనకు ఎవరు సహకరించారనే దిశలో విచారణ ఎందుకు జరగడం లేదు. జగన్ అభిమాని దాడి చేశాడని డీజీపీ సంఘటన జరిగిన గంటలోనే ఎలా చెప్తారు? సీఎం అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతారు. అలిపిరి ఘటనలో ఆనాడు వైఎస్ఆర్ చంద్రబాబును పరామర్శించలేదా? గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలుపలేదా? ఇప్పుడు చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నారు. కన్న కొడుకుపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించిన చరిత్ర వైఎస్సార్ది.
జగన్పై దాడి చేసింది అభిమానే అంటూ రోజుకో రకం ప్లెక్సీలు సృష్టిస్తున్నారు. అభిమాని అయితే కలిసిన మొదటిసారే కత్తితో దాడికి దిగుతాడా? ఒకవేళ అభిమానే అయితే విచారణ చేయవద్దా? అని అడుగుతున్నా. ఎయిర్ పోర్ట్ లో రెస్టారెంట్ ఓనర్ ను ఎందుకు విచారించరు. ఘటన జరిగిన చాలా సేపటి తర్వాత లేఖలు ఎలా వచ్చాయి. ముడతలు లేని లేఖలో మూడు నాలుగు రాతలు ఉన్నాయంటే మరో సమాధానం చెబుతారు. నిష్పాక్షికమైన విచారణ జరగాలని కోరుతున్నా. థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. చంద్రబాబుపై ఎప్పుడో దాడి జరిగితే...ఇప్పటికి జడ్ కేటగిరి భద్రత ఎందుకు పెట్టుకున్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదా? ఎవరైతే ఈ హత్యాయత్నం చేశారో వారికి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని చెబుతున్నాను. ఇప్పటికే వైఎస్ఆర్ను పోగొట్టుకొని బాధలోఉన్నాం. నా కొడుకును దూరం చేసి నా కడుపుకొట్టొద్దని మొక్కుతున్నా.’ అని విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. పత్రికలు, మీడియా నిజాలు చూపించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు