చంద్రబాబు పాలనలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి
వైఎస్సార్ హయాంలో అందరికీ భరోసా ఉండేది
అయిదు సంతకాల పేరుతో చంద్రబాబు డ్రామాలు
కనీసం తొలి సంతకాన్ని కూడా చేయలేదు
అమరావతిలో ఒక్క శాశ్వత భవనం అయినా ఉందా?
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు హయంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం అమరావతిలో ఆమె మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. అదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకునేవారని వైఎస్ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... రైతులను మోసం చేశారని విమర్శించారు. మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు...తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు.
ఓ సామాన్యురాలిగా ప్రశ్నిస్తున్నా...
‘నేను వైఎస్సార్ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నా.. భూతద్దం పెట్టుకుని వెతికినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. మహానేత వైఎస్సాఆర్ హయాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంటకు గిట్టుబాటు ధర ఉండేది. ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది. పేద విద్యార్థి ఉచితంగా గొప్ప చదువులు చదివేలా పూర్తి రీయింబర్స్మెంట్ ఉండేది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు ఆఖరికి పార్టీలకు కూడా అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్ ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు.’ అన్నారు.
ఇవి వాస్తవాలు కావా చంద్రబాబు..
బాబు అధికారంలోకి రావడానికి మొత్తం రుణమాఫీ అని వాగ్దానం చేసి అదే మొదటి సంతకం అవుతుందని చెప్పి ఎన్నికల అయిపోయిన తర్వాత రుణమాఫీ ఫైల్పై సంతకం పెట్టకుండా రుణమాఫీకి కమిటీ వేస్తున్నానని సంతకం పెట్టారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు మొత్తం రుణం మాఫీ చేస్తామన్నారు. ఆ శాఖకు చెందిన మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో సమాధానమిస్తూ మహిళలకు రుణమాఫీ చేయలేదన్నారు. రూ.14వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టు వ్యయాన్నిరూ.60వేల కోట్లకు పెంచారు. నామినేషన్ పద్ధతిలో బాబుకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేంద్రం నుంచి పోలవరాన్ని లాగేసుకున్నది నిజం కాదా?. పోలవరాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మీరు చెప్పలేదా చంద్రబాబు? నేటికి అది పూర్తి కాలేదంటే అది మీ అసమర్థత కాదా?. ప్రశ్నలు సంధించారు.
ఊసరవెల్లి సిగ్గుపడాలి..
అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపారు. కానీ ఒక్క శాశ్వత భవనం కట్టారా. చంద్రబాబు పేద విద్యార్థుల భవిష్యత్ ఖూనీ చేసింది నిజంకాదా. పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసింది నిజం కాదా. లోకేష్కి ఏకంగా మూడు శాఖలు అప్పగించారు, జయంతికి, వర్దంతికి తేడా తెలియనివాడికి మూడు శాఖలా ఎలా అప్పగిస్తారు?. డేటా చోరీ దోషులని ఇప్పటికి పట్టుకోలేదు, సిగ్గుగాలేదా?. బాబు, మోదీ జోడీ రాష్ట్రానికి అన్యాయం చేసింది వాస్తవం కాదా. ప్రత్యేక హోదా నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోరా. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా. ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఎక్కడ చూసినా అవినీతి. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి అని మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు చందమామ ని తెచ్చిస్తా అంటే ప్రజలు నమ్మలా. నిప్పు నిప్పు అంటే తుప్పు నిప్పవుతుందా. అసత్యానికి మారు పేరు చంద్రబాబు. చంద్రబాబు సూటిగా చెప్పండి...జగన్ అన్న ఊరురు తిరిగి హోదా కోసం పోరాడకపోతే నీ నోట హోదా మాట వచ్చేదా, చేతనైతే నిజం చెప్పు. చంద్రబాబు రోజుకొక మాట, పూటకో వేషం, మిమ్మల్ని చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకోవాలి.
జగనన్న జనంలోనే ఉన్నాడు..
9 ఏళ్ళు జగనన్న విలువల రాజకీయము చేశాడు, చంద్రబాబులా అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వలేదు, పదవుల కంటే విశ్వసనీయత ముఖ్యం అనుకున్నాడు. నాన్నలా అందరికి మేలు చేయాలనుకుంటున్నాడు. చంద్రబాబుకు వెన్నుపోటు, మోసం, అవినీతి, స్వార్ధ రాజకీయాలు, హత్యలు చేయడంలో అనుభవం ఉంది. 5 ఏళ్లలో కొన్ని వందల మందిని పొట్టన బెట్టుకున్నారు, రిషితేశ్వరి, వనజాక్షి విషయంలో చంద్రబాబు ఏం చేశారు. చంద్రబాబు అరాచకవాది కాదా. చంద్రబాబుని మించిన దుష్టుడు ఉండరు అని ఎన్టీఆర్ అన్నారు. ప్రజలు ఆలోచించండి. బాబు పాలనలో రాష్ట్రం ఎక్కడికి పోతుంది. ఈ ఎన్నికలు రాష్ట్రానికి, ప్రజలకు ముఖ్యం. ఆలోచించి ఓటు వేయండి.
అయిదేళ్లు గాడిదలు కాశారా?
చంద్రబాబు ఈ అయిదేళ్లు ఏళ్ళు గాడిదలు కాశారా?. పవన్ కళ్యాణ్ యాక్టర్, యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి. ప్రస్తుతం ఆయన అదే చేస్తున్నాడు. చంద్రబబు డైరెక్టర్ కాబట్టే ....డైరెక్టర్ చెప్పినట్టు పవన్ చేస్తున్నాడు. పవన్ నామినేషన్కి పచ్చ పార్టీ క్యాడర్ ఉంటుంది. పైకి మాత్రం పొత్తులు లేవని చెబుతూ..లోపల కుమ్మక్కు రాజకీయాలు. పవన్కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే. జనసేన పార్టీకి ఓటు వేస్తు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లే. మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా రాజకీయం చేస్తున్నారు. కుటుంబ పెద్దను ఎవరైనా చంపుకుంటారా?. మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటున్నారా. మేము బాధితులు, మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా కుటుంబ సభ్యుల హత్యలు జరిగాయి. చంద్రబాబుకు దమ్ముంటే థర్డ్ పార్టీ విచారణకి సిద్ధపడాలి.’ అని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో అమ్మ విజయమ్మ కూడా ప్రచారం చేస్తారని, తాను 29 నుంచి మంగళగిరి నుంచి ప్రారంభిస్తా అని ఆమె షర్మిల తెలిపారు.