అరాచకం శ్రుతిమించిందన్నా..
అడుగడుగునా టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ప్రశ్నిస్తే దాడులు..
ప్రతిపక్ష నేత జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న జనం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అన్నా.. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.. ఊరూరా టీడీపీ నేత ల దౌర్జన్యాలు మితిమీరిపోయాయి.. వారు చెప్పినట్లు వినాలట.. లేకుంటే ఏ ప్రభుత్వ పథకమూ దక్కకుండా చేస్తారట.. పింఛన్లు కట్ చేస్తున్నారు.. ఉపాధి పనులకు పిలవడం లేదు.. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు దాడులే.. భరించలేకపోతున్నామన్నా..’ అంటూ వివిధ వర్గాల ప్రజలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో గోడు వెళ్లబోసుకున్నారు.
ప్రజా సంకల్పయాత్ర 140వ రోజు గురువారం కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో కొనసాగింది. ఉదయం శోభనాపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభం కాగానే కార్మికులు, కర్షకులు, కూలీలు, మహిళలు, రైతులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జననేతకు ఘన స్వాగతం పలికారు. మన కష్టాలు వినే నాయకుడు వచ్చాడంటూ సమస్యలు చెప్పుకున్నారు. టీడీపీకి ఓటు వేయలేదని తన కాలు విరగ్గొట్టారని ఈదరకు చెందిన సరోజిని చెప్పడంతో జగన్ చలించిపోయారు.
చికిత్స కోసం వెళితే ఆరోగ్య శ్రీ కూడా వర్తించదన్నారని, పనుల కు వెళ్లలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కాలికి వేసిన రాడ్ తీయడానికి రూ.30 వేలు అవుతుందని డాక్టర్లు చెప్పారని పేర్కొంది. జగన్ స్పందిస్తూ.. రాజకీయ కక్ష సాధింపు కోసం పేదలపై దాడులు చేయడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సంబంధిత వార్తలు