కాంగ్రెస్‌తో ఆరో పెళ్లికి బాబు సిద్ధం

YS Jagan Slams ChandraBabu Naidu At Kotauratla - Sakshi

కోటఉరట్ల సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

త్కాలిక సచివాలయం నిర్మాణానికి గాను అడుగుకు రూ.10 వేలు చెల్లించారు. శాశ్వత సచివాలయానికి ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా వేయలేదు. తాత్కాలిక సచివాలయం వద్ద 3 సెంటీమీటర్ల వర్షం కురిస్తే లోపల 6 సెంటీమీటర్ల వర్షం కనిపిస్తోంది. భారీ ఖర్చుతో నిర్మించిన ఈ తాత్కాలిక సచివాలయం సీలింగ్‌ ఊడిపోయింది. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం పేరుతో రూ.6 వేల కోట్లు దుబారా చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఈ ఖర్చు పోలవరంపై చేసి ఉంటే ఈ పాటికి నీళ్లొచ్చేవి. 
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘చంద్రబాబు నాయుడు ఇప్పటి దాకా బీజేపీ సహా ఐదు పార్టీలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేయడం, విడాకులు ఇవ్వడం కూడా అయిపోయింది. తాజాగా కాంగ్రెస్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. కాంగ్రెస్‌ను శాశ్వతంగా బహిష్కరించినా కసి తీరదని ఏడాది క్రితం చెప్పిన ఈ పెద్దమనిషి ఇప్పుడు చేసిందేమిటి? రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో దగ్గరుండి మద్దతిస్తాడా? ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో దొడ్డిదారి రాయబారం చేస్తాడా? ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నారు’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 241వ రోజు సోమవారం విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని కోటఉరట్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు పరిపూర్ణమైన అవకాశవాది అని యావత్‌ రాష్ట్రానికి తెలిసిపోయిందన్నారు. నాలుగేళ్ల ఈయన పాలనకూ, 150 ఏళ్ల బ్రిటీష్‌ పాలనకూ తేడా ఏమైనా ఉందా.. అని ప్రశ్నించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

పరిపూర్ణమైన అవకాశవాది  
‘‘చంద్రబాబు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీగా పుట్టింది. 2017 జూన్‌లో ఓ టీవీ చానల్‌కు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నాడు? కాంగ్రెస్‌ పార్టీని శాశ్వతంగా బహిష్కరించాలన్నాడు. అలా చేసినా ప్రజలకు కసితీరదన్నాడు. ఏడాది క్రితం ఆ మాట చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నాడు? రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీకి రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో దగ్గరుండి మద్దతిచ్చాడు ఈ పెద్దమనిషి. ఈ మధ్య మరో అడుగు ముందుకేశారు. రాహుల్‌ గాంధీ ఓ హోటల్‌కొస్తే.. రాయబారం కోసం చంద్రబాబు కుటుంబ సభ్యులు కలిశారు. ఇప్పటికే బీజేపీని పెళ్లి చేసుకుని వదిలేశాడు. టీఆర్‌ఎస్‌తో, సీపీఐతో, సీపీఎంతో, చివరకు జనసేనను కూడా పెళ్లి చేసుకుని వదిలేశాడు. ఇప్పుడు నిస్సిగ్గుగా.. కాంగ్రెస్‌ను పెళ్లి చేసుకునేందుకు బయల్దేరాడు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మారుస్తున్న ఈ పెద్దమనిషిని చూశాక పరిపూర్ణమైన అవకాశవాది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. 

అన్నింటా బాదుడే బాదుడు 
చంద్రబాబు పాలనకు, 150 ఏళ్ల క్రితం నాటి బ్రిటీష్‌ పాలనకూ ఏమన్నా తేడా ఉందా? ఆ రోజుల్లో ప్రజలకు ప్రాథమిక హక్కులుండేవి కావు. మన సహజ సంపదంతా ఇష్టమొచ్చినట్టు దోచుకునేవాళ్లు. ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టేవాళ్లు. పన్నులు వేసి పీల్చి పిప్పి చేసేవాళ్లు. రైతుల భూములు లాక్కునేవాళ్లు. తిరగబడితే కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్లు. ఒకే కులం, మతంలోనూ చిచ్చుపెట్టేవాళ్లు. విభజించి పాలించే విధానం ఉండేది. కరవొచ్చి జనం చస్తున్నా పట్టించుకునే వాళ్లు కాదు. డొక్కెండినా కనికరం చూపించేవాళ్లు కాదు. ఆ పాలనకూ.. ఈ నాటి చంద్రబాబు పాలనకు ఏదైనా తేడా ఉందా? ఈయన హయాంలో చూస్తున్నదేమిటి? పోలీసు రాజ్యం నడుస్తోంది. పల్నాడు (గుంటూరు) నుంచి మొదలు పెడితే ప్రకాశం, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ ఇలా ఏ జిల్లాను తీసుకున్నా.. ఇసుక, మట్టి, లేటరైట్, సున్నపురాయి దేన్నీ వదిలిపెట్టడం లేదు. సహజవనరులన్నీ దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ అక్రమ మైనింగ్‌కు సాక్షాత్తూ ముఖ్యమంత్రే డాన్‌ అయ్యాడు. ఈయన పాలనలో మహిళలకు రక్షణ లేదు. వైద్య కాలేజీల్లో పిల్లలు, రైతులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులు ప్రాణాలొదిలేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు సీఎం, ఆయన కొడుక్కు మాత్రమే కనిపిస్తున్నాయి. నిరుద్యోగం గ్రామ గ్రామంలో ఇంటింటా మనకు కనిపిస్తోంది. కానీ విశాఖలో సమ్మిట్‌ పెట్టి.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలొచ్చాయని ఈ పెద్దమనిషి చెబుతాడు. అవి మీకు ఎక్కడన్నా కనిపించాయా? ఈయన పాలనలో వేరే పార్టీ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి సంతల్లో పశువుల్లా కొంటున్నారు. నిస్సిగ్గుగా వాళ్లలో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు.  

దుబారా అంతా.. ఇంతా..? 
రాష్ట్రంలో చంద్రబాబు దుబారా ఖర్చులెలా ఉన్నాయో తెలుసా? ఆ దుబారాలోంచి కూడా లంచాలు మెక్కే ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. అమరావతికి ఈ మధ్య చంద్రబాబు బాండ్లిచ్చాడట. అవి ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యాయట. రూ.2 వేల కోట్లు వచ్చాయట. ఇది చంద్రబాబు చెప్పడం.. ఎల్లో మీడియా తాన తందాన కొట్టడం. ఆహా.. ఓహో.. ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగుడుతోంది ఎల్లో మీడియా. ఈయన సేకరించిన రూ.2 వేల కోట్ల బాండ్ల మీద వడ్డీ ఎంతో తెలుసా? అక్షరాల 10.32 శాతం. పక్క రాష్ట్రం తెలంగాణ జీహెచ్‌ఎంసీకి సంబంధించి బాండ్లు తెచ్చింది. అక్కడ వడ్డీ రేటు 8.9 శాతం. పూనే వాళ్లు 7.59 శాతం వడ్డీకే తెచ్చారు. పక్క రాష్ట్రం వాళ్లు అంత తక్కువ వడ్డీకి తెస్తే.. ఇక్కడ ఎక్కువకు తీసుకొచ్చి రూ.2 వేల కోట్లకు మరో రూ.2 వేల కోట్లు కలిపి పదేళ్లు కట్టాల్సిన పరిస్థితి మీ గొప్పతనమా చంద్రబాబూ? బాండ్లల్లో కూడా కమీషన్లు తీసుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయన తెచ్చిన రూ.2 వేల కోట్లకు కమీషన్‌ ఎంతో తెలుసా? అక్షరాల రూ.17 కోట్లు. తెలంగాణ వాళ్లు రూ.వెయ్యి కోట్లకు రూ.కోటి కమీషన్‌ ఇచ్చారు. ఈ లెక్కన రూ.2 వేల కోట్లు కమీషన్‌ అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం రూ.2 వేల కోట్లకు రూ.17 కోట్లు కమీషన్‌ ఇచ్చి, అందులో రూ.10 కోట్లు తన జేబుల్లోకి లంచంగా తీసుకున్నాడు. విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే రాజధాని నిర్మాణం చేపట్టవలసి ఉన్నా సింగపూర్‌ తరహా రాజధాని పేరుతో రైతుల భూములను కాజేసి అభివృద్ధి పేరుతో వీటిని తనకు కావాల్సిన వారికి లంచాలకు కట్టబెట్టారు.  

పథకం ప్రకారం సహకార చక్కెర ఫ్యాక్టరీల మూత 
ఈ రోజు ఈ ప్రాంత రైతులు నన్ను కలిశారు. వాళ్లంతా.. మా ఖర్మేంటోగానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంతి అయినా సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయన్నాని చెప్పారు. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి కాలంలో సహకార చక్కెర ఫ్యాక్టరీలు లాభాల్లో ఉండేవని తెలిపారు. మళ్లీ చంద్రబాబొచ్చాడు.. మళ్లీ అదే పరిస్థితి అన్నారు. విశాఖ జిల్లాలో తుమ్మపాల, విజయనగరంలో బీమ్‌సింగి, శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస చక్కెర ఫ్యాక్టరీలు ఇప్పటికే మూసేశారని, ఇప్పటికే నడుస్తున్న తాండవ ఫ్యాక్టరీ రూ.40 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ఏటికొప్పాక ఫ్యాక్టరీ రూ. 22 కోట్లు, చోడవరం చక్కెర ఫ్యాక్టరీ రూ.వంద కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. బ్రహ్మాండంగా పని చేయాల్సిన ఈ ఫ్యాక్టరీలన్నింటినీ పద్ధతి ప్రకారం నష్టాల బాట పట్టిస్తున్నారని, తన బినామీలకు తక్కువ రేట్లకు అమ్ముకునే పని చేస్తున్నారని రైతులు నా దగ్గర వాపోయారు. ఏటికొప్పాక ఫ్యాక్టరీ 5 వేల మంది రైతులకు రూ.4.25 కోట్ల బకాయి పడిందని, ఆరు నెలల నుంచి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్‌ హయాంలో ఇదే ఫ్యాక్టరీ రూ.5 కోట్ల లాభాల్లో ఉందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయన ప్రతీ ఫ్యాక్టరీకి టన్ను చెరకుకు రూ.300–400.. అవసరాన్ని బట్టి రాయితీ ఇచ్చారని, తాండవ ఫ్యాక్టరీకైతే రూ.750 ఇచ్చారని చెప్పారు. ఇవాళ పరిస్థితి ఏమిటి? టన్ను చెరకు రూ.2,400కు కూడా కొనే పరిస్థితి లేదు. ఇందులో చెరకు నరకడానికి, ఫ్యాక్టరీకి చేరవేయడానికే టన్నుకు రూ.1,100 అవుతోందని, ఇలాగైతే ఎలా గిట్టుబాటు అవుతుందని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లో టన్నుకు రూ.3,500 ఇస్తున్నారని, అక్కడ వాళ్లకున్నదేమిటి? మనకు లేనిదేమిటన్నారు. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటమే మనం చేసుకున్న ఖర్మ అని ఆందోళన వ్యక్తం చేశారు.  

తాగునీటికీ దిక్కులేదు 
ఈ నియోజకవర్గంలో 150 గ్రామాలు తాగునీటి సమస్యతో అల్లల్లాడుతున్నాయి. పరిష్కరించాలన్న ఆలోచన పాలకులకు రాదు. చంద్రబాబు సీఎం కాకమునుపే రూ.50 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా అది నత్తనడకన సాగుతోంది. నాన్నగారి హయాంలో ఈ ఒక్క నియోజవర్గంలోనే 26 వేల ఇళ్లు కట్టించారని ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. ఇవాళ గ్రామానికి ఐదు ఇళ్లు కూడా కట్టించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉందని తెలిపారు. వైఎస్‌ హయాంలో 5 వేల మంది నిరుపేదలకు 8 వేల ఎకరాలు పంపిణీ చేశారన్నా.. చంద్రబాబు మా భూములు ఎలా లాక్కోవాలని చూస్తాడు తప్ప, ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదన్నా.. అని చెప్పారు. ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నా.. కనీసం పునాది రాయి కూడా వెయ్యలేదన్నా.. అని చెప్పారు. నక్కపల్లి గురుకుల పాఠశాలను మినీ యూనివర్సిటీగా చేస్తానన్నాడు చంద్రబాబు.. అదెక్కడైనా మీకు కనిపించిందా? నక్కపల్లి ఆసుపత్రిని 30 పడకల నుంచి 50 పడకలుగా మారుస్తానని టీడీపీ నేతలు చెప్పారని, హామీ నిలబెట్టుకోవడం మాట దేవుడెరుగు, అక్కడ 8 మంది డాక్టర్లకుగాను ఐదుగురు కూడా లేరని ప్రజలంటున్నారు. ఆర్థోపెడిక్, ప్రసూతి వైద్యులు కూడా లేరని తెలిపారు. ఉన్న ఒక్క 108 వాహనం పని చేయడం లేదట. పాయకరావుపేట పీహెచ్‌సీలో రెండు నెలలుగా మందుల సరఫరా కూడా లేదట. మత్స్యకారులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు.  

ఇలాంటి నాయకుడిని నమ్మొద్దు 
ఇన్ని మోసాలు, అన్యాయాలు చేసిన ఇలాంటి నాయకుడిని మీరు నమ్ముతారా? తాను ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలు నెరవేర్చానని మీ చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెడతారు. మీరు నమ్మరని.. ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటారు. ఇవీ నమ్మరని మీ వద్దకు మహిళా సాధికార మిత్రలను పంపించి ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన డబ్బే. మన జేబుల్లోంచి దోచేసుకున్నదే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. మనందరి ప్రభుత్వం రాగానే వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

మానవత్వంలేని ప్రభుత్వమిది.. 
చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఈ ప్రాంతంలోనే లక్కపల్లి మండలంలో గతంలో 6 వేల ఎకరాలు పరిశ్రమల కోసం భూసేకరణ జరిగింది. ఎన్నికల ముందు ఈ విషయంలో చంద్రబాబు అక్కడకెళ్లి.. భూసేకరణ కోసం అధికారులెవరైనా వస్తే చెట్టుకు కట్టేసి కొట్టమని చెప్పాడు. ఇప్పుడీ పెద్దమనిషి చేసిందేమిటి? భూములు కోల్పోయిన పట్టాదారులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. భూములు మాత్రం నోటిఫై చేస్తారు. ఇక్కడ రైతులకు అవసరాలకు అప్పు పుట్టడం లేదు. నోటిఫై చేశారు కాబట్టి ఉన్న భూమిని అమ్ముకోలేరు. పిల్లల పెళ్లిళ్లు చేసుకోలేని, వాళ్లను చదివించుకోలేని దుస్థితిలో రైతన్నలున్నారు. ఇదే నక్కపల్లిలో డీఫాం పట్టాలు, అసైన్డ్‌ భూములున్నవాళ్లకు ఎకరాకు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంత వరకూ ఒక్కపైసా ఇచ్చిన పాపాన పోలేదు. మామిడి, జీడిమామిడి, కొబ్బరి చెట్టుకు ఒక్కోదానికి రూ.5 వేలు ఇస్తానని చెప్పి, రూ.1,500 కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. బోలపాడు, మూలపర్ర, తమ్మయ్యపేట, బచ్చిరాజుపేట, రాజయ్యపేటలో సగం గ్రామాలను ఖాళీ చేయిస్తామంటున్నారు. వాళ్లకేం చేస్తారనేది ఇప్పటి వరకూ చెప్పలేదు. రామయ్యపేటలో రాజశేఖరరెడ్డి  గారి హయాంలో పేదలకు 200 ఇళ్లు కట్టించారు. వాళ్లకు పునరావాసం కూడా కల్పించని మానవత్వంలేని ప్రభుత్వమిది. 

రికార్డులు మార్చి భూ ఆక్రమణలు
విశాఖ తర్వాత పాయకరావుపేటలోనే భూ అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 300 ఎకరాల రికార్డులను తారుమారు చేసి, కొట్టేయడానికి టీడీపీ నేతలు స్కెచ్‌ వేశారని, దాన్ని అడ్డుకోవడానికి రైతులు, వైఎస్సార్‌ పార్టీ శ్రేణులు ఉద్యమించాల్సి వచ్చిందని ఇక్కడి రైతులు నాతో చెప్పారు. ఎక్కడబడితే అక్కడ రికార్డులు మార్చేసి వాళ్ల అత్తగారి సొత్తన్నట్టు కాజేస్తోందీ ప్రభుత్వం. రైతులకు పట్టాలిప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల చొప్పున రూ. కోటి వసూలు చేశారని రైతులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ ఒక్క టీడీపీ నేతను కూడా బొక్కలో పెట్టని దుర్మార్గమైన పరిస్థితి చూస్తున్నాం. వరాహ, తాండవ నదుల్లో ఇసుకను ఇష్టానుసారం దోచేస్తున్నారు. కైలాస పట్టణం, గోతివాడ, చేడువాడ, తందూరు, రామచంద్రాపురం, సొండేరుపల్లి, పెనుగొల్లు, లింగరాజుపాలెం, దార్లపూడి, పెద్ద ఉప్పాలం ఇసుక రీచ్‌ల నుంచి రోజూ వేల లారీల్లో ఇసుకను విశాఖకు తరలిస్తున్నారు. ఇసుక, లేటరైట్‌తో పాటు  సహజ వనరులన్నీ దోచేస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, చినబాబు, పెదబాబు దాకా లంచాలు తీసుకుంటున్నారు. నీరు–చెట్టు పేరు చెప్పి మట్టినీ తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు బిల్లులు పెట్టుకుంటున్నారు. ఒక్కో చెరువును తాటి చెట్టులోతు తవ్వుతున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ పథకం ద్వారా రూ.20 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పారు. పాయకరావు పేట నియోజకవర్గం దోపిడీకి పరాకాష్టగా మారిందనిపిస్తోంది.

మనందరి ప్రభుత్వం రాగానే.. 
- నాలుగున్నరేళ్ల క్రితం రూ.87,612 కోట్లు ఉన్న రైతు రుణాలు.. చంద్రబాబు చేసిన రుణమాఫీ హామీ నెరవేరక వడ్డీలతో కలిపి రూ.లక్షా 26 వేల కోట్లకు చేరాయి. మన ప్రభుత్వం రాగానే రైతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తాం. ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా రుణాలు.   
మే నెలలో ప్రతీ రైతు కుటుంబానికి రూ.12,500.    
రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.  
ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే కరెంట్‌.  
పంట వేయడానికి ముందే గిట్టుబాటు ధర కల్పిస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.   
రూ.4 వేల కోట్ల (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి)తో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి.    
పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి.   
మూతపడ్డ సహకార డెయిరీలను పునరుద్ధరిస్తాం. వీటికి పాలు పోసిన రైతన్నలకు లీటరుకు రూ.4 సబ్సిడీ ఇస్తాం.   
అనుకోకుండా ఏ రైతు అయినా ఈ లోకాన్ని వీడిపోతే అప్పుల వాళ్లు అతని కుటుంబంపై పడి పీడించకుండా ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. రూ.5 లక్షలు ఆ కుటుంబానికి వారంలోగా అందజేసి తోడుగా ఉంటాం. 
రైతన్నల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ నుంచి మినహాయింపు. 
కోల్డ్‌ స్టోరేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, గిడ్డంగుల ఏర్పాటు. 

రూ.6 వేల కోట్లు దుబారా.. 
ధర్మపోరాట దీక్షల పేరుతో జిల్లాకు రూ.4 కోట్ల వంతున డ్రామా దీక్షలకు రూ.52 కోట్లు 
ప్రత్యేక విమానాలకు రూ.100 కోట్లు  
హైదరాబాద్‌లో ఎన్‌ బ్లాక్‌ నిర్మాణానికి రూ.14.63 కోట్లు 
లేక్‌ వ్యూ అతిథి గృహానికి రూ.9.50 కోట్లు 
హైదరాబాద్‌లో ఫర్నిచర్‌కు రూ.10 కోట్లు 
ప్రధాని మోదీతో రాజధాని నిర్మాణం కోసం టెంకాయ కొట్టించడానికి రూ.250 కోట్లు.. మరో మూడు సార్లు టెంకాయలు కొట్టడానికి మరో రూ.100 కోట్లు  
- హైదరాబాద్, విజయవాడ మధ్య అధికారుల ప్రయాణ ఖర్చు రూ.120 కోట్లు 
రాజధాని నిర్మాణ కన్సల్టెన్సీ కోసం రూ.300 కోట్లు 
హైదరాబాద్‌లో కొడుకు, కోడలు హోటల్‌ ఖర్చు రూ.30 కోట్లు  
దేవుడి పేరుతో గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం రూ.3200 కోట్లు 
హ్యాపీ సండే పేరుతో రూ.10 కోట్లు 
హ్యాపీ సిటీల కోసం రూ.61 కోట్లు  
రాజధాని మాస్టర్‌ ప్లాన్‌కు రూ.115 కోట్లు 
జన్మభూమి సభలకు రూ.125కోట్లు 
నవ నిర్మాణ దీక్షలకు రూ.80 కోట్లు 
పోలవరం పునాది గోడలు దాటకుండానే బస్సు ప్రయాణం పేరుతో రూ.22.50 కోట్లు  
విశాఖలో సమ్మిట్ల పేరుతో రూ.150 కోట్లు (ఇతరత్రా వృధా ఖర్చులతో కలిపి రూ.6 వేల కోట్లు) 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top