నన్ను ఆశీర్వదించండి
రాష్ట్ర ప్రజలకు ట్విట్టర్లో వైఎస్ జగన్ విజ్ఞప్తి
మీ ప్రేమాభిమానాలవల్లే ఈ తొమ్మిదేళ్లు నిలబడగలిగా
మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను
మీ నిర్ణయమే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది
కొత్త పాలనా శకంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది
సాక్షి, అమరావతి: ఈ నెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున తనను ఆశీర్వదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ తొమ్మిదేళ్లు తాను నిలబడగలిగానంటే అది రాష్ట్ర ప్రజలు తనపై ప్రదర్శించిన ప్రేమాభినాలు, దేవుడి దయ వల్లనేనని ఆయన అన్నారు. ‘‘ఈ నెల 11వ తేదీన మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. మీరు తెలివిగా, విచక్షణతో ఓటు వేస్తారని, మెరుగైన రేపటికోసం భారీగా ఓటు హక్కును వినియోగించుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. రండి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం’ అని జగన్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన పలు ట్వీట్లు చేశారు.
కొత్త పాలనా శకంలోకి...
‘సగటు జీవుల మంచికోసం, వారి సంక్షేమం కోసం ఒక కొత్త పరిపాలనా శకంలోకి మనందరమూ అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. ఈ కొత్త శకంలో సమాజంలోని ప్రతిదీ పునర్నిర్మితం అయ్యేందుకు సహకరిస్తుంది’ అని జగన్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
మీ ప్రేమానురాగాలే నిలబెట్టాయి..
‘‘ఈ తొమ్మిదేళ్ల నా ప్రస్థానంలో మీరు నాపై ప్రదర్శించిన ప్రేమానురాగాలు, దేవుడి దయలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టేలా బలం చేకూర్చాయి. నా సంకల్పాన్ని కూడా నిర్దేశించాయి’’ అని వేరొక ట్వీట్లో ఆయన స్పష్టం చేశారు.
ప్రజల ఆకాంక్షలు, అవసరాలు తెలుసుకున్నాను..
‘‘మీ ఆకాంక్షలు, అవసరాలు మరింతగా తెలుసుకునేందుకు నా ఈ అను నిత్యగమనం ఎంతో ఉపయోగపడింది. ప్రస్తుత ప్రభుత్వంపై మీరు కోల్పోయిన విశ్వాసాన్ని, అసంతృప్తిని చూశాక మెరుగైన సమాజం కోసం మరింతగా మీ సమస్యలకోసం కృషి చేయాలనే నా సంకల్ప బలాన్ని పెంచాయి’ అని కూడా ఆయన మరో ట్వీట్ చేశారు.
Your vote on 11th of April will decide the future of Andhra Pradesh. I seek your blessings. I believe that you will vote wisely and in large numbers for a better tomorrow. Come, let’s vote for Fan. #VoteForFan
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2019