రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ప్రధానమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందిందని, దీనిపై సోమవారం చర్చిస్తామని లోక్సభ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో వైఎస్ జగన్ శుక్రవారం ట్వీటర్లో స్పందించారు.
ఆయన చేసిన ట్వీట్..
‘రాజకీయ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, ఎవరి తీర్మానం పరిగణనలోకి తీసుకుంటారనేది ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పౌరుల హక్కులకు హామీ దొరికిందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందా? అన్నదే ముఖ్యం’
ఇది ఏపీ ప్రజల విజయం
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా చేస్తున్న అవిశ్రాంత పోరాటం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ అనివార్యంగా దిగిరాకతప్పలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు.
ఆయన చేసిన ట్వీట్....
‘ప్రత్యేక హోదాపై మేము చేస్తున్న పోరాటాన్ని చూసి ఎట్టకేలకు దేశంతో పాటు టీడీపీ మేల్కొంది. రాజకీయంగా మరో మార్గంలేని, తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ మరోసారి అనుసరించింది. ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ప్రత్యేక హోదా విషయంలోనూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులకోసం పోరాటం చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముందుంటుంది’.