ఆళ్లగడ్డలో వైఎస్ జగన్కు జననీరాజనం
సాక్షి, ఆళ్లగడ్డ: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ చేరుకున్నారు. జననేతకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పూలతో నీరాజనాలు పట్టారు. వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన జనంతో ఆళ్లగడ్డ పట్టణం కిక్కిరిసింది. ఎటు చూసినా జనమే కనిపించారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కరచాలనాలు చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. వారందరినీ అప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగించారు. తర్వాత ఫోర్ రోడ్ జంక్షన్ చేరుకుని అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తనపై అమితమైన అప్యాయతలు కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు పాలసాగరంలో వైఎస్ జగన్ను ఐకేపీ యానిమేటర్లు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రంలో 28 వేల మంది ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి జగన్ హామీయిచ్చి ముందుకు సాగారు.