అన్నా.. రోగమొస్తే చావాల్సిందేనా?

Ys jagan prajasankalpa yatra in west godavari district - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్న జనం

ఒక్కొక్కరిదీ ఒక్కో దీన గాథ

వివిధ వ్యాధులతో బాధ పడుతూ వైద్యం అందక సతమతం

ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారని వాపోయిన వైనం

అందరి సమస్యలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జననేత

ఆశా వర్కర్లకు తెలంగాణలో కంటే రూ.వెయ్యి ఎక్కువ ఇస్తామని హామీ

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. నాలుగేళ్ల క్రితం వరకు ఏ పెద్ద రోగం వచ్చినా భయపడకుండా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఆసుపత్రులకు వెళ్లేవాళ్లం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని ఉచితంగానే వైద్యం అందేది. మా ఖర్మకొద్దీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌కు వెళితే ఇక్కడ చూడం అని మొహం మీదే చెబుతున్నారు. పోనీ ఇక్కడైనా చూపించుకుందామంటే సవాలక్ష కొర్రీలతో ఈ పథకాన్ని నాశనం చేశారు.

పెద్ద పెద్ద రోగాలొస్తే ప్రాణాలు వదలాల్సిందేనా?’ అంటూ వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స అందక తల్లడిల్లిపోతున్న పలువురు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజా సంకల్ప యాత్ర 164వ రోజు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో సాగింది.  పెరుగుగూడెం నుంచి పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలుకుతూ వారి సమస్యలు చెప్పుకున్నారు.

రాజా పంగిడి గూడెంలో మేళ తాళాలు, తప్పెట్లు, డప్పు నృత్యాలు, మంగళహారతులతో.. వార్లు పోసి దిష్టితీసి గ్రామంలోకి ఆహ్వానించారు. యాత్ర కొనసాగిన సూర్యచంద్రరావు పేట, గొల్లగూడెం, తిరుమలపాలెం, పాములూరు గూడేలలో సైతం ఇదే తరహాలో ఘన స్వాగతం లభించింది. అదే సమయంలో అభాగ్యులు, అన్నార్తులు, అన్నదాతలు, కులవృత్తులవారు, దివ్యాంగులు ఇలా అనేకులు జగన్‌కు తమ సమస్యలను వివరిస్తూ పరిష్కారాలు చూపండని కోరారు. తక్షణమే పరిష్కరించగలిగిన వాటిని జగన్‌ అక్కడికక్కడే పరిష్కరించారు. ఇతరత్రా సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో ఆలోచిస్తామని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.   

ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..
రాజా పంగిడిగూడెం గ్రామానికి చెందిన షేక్‌ అల్తాఫ్‌ వయస్సు పదేళ్లు. రెండు మూత్ర పిండాలలో ఒకటి పాడైంది. ఇప్పటికే రెండుసార్లు ఆపరేషన్‌ జరిగింది. కూలీనాలీ చేసుకుని బతికే ఆ పిల్లాడి తల్లిదండ్రులు బిడ్డమీద మమకారంతో ఇప్పటికే రూ.2 లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మూడోసారి ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారు. దీంతో తన బిడ్డను తీసుకుని అల్తాఫ్‌ తల్లి అక్తర్‌ మున్నీసా వైఎస్‌ జగన్‌ను కలిసింది. తన బిడ్డను బతికించుకునే దారి చూపించయ్యా.. అని అర్థించింది.

ఆ బిడ్డను బతికించేందుకు చర్యలు తీసుకుంటానమ్మా అని జగన్‌ ఆ తల్లికి హామీ ఇచ్చారు. ఈ దీనగాథ విని పది అడుగులు ముందుకు వేశారో లేదో గుర్రం వెంకట్రావ్‌ అనే రైతు తన కష్టాలను ఏకరవుపెట్టారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ఆరోగ్య శ్రీ వర్తించదని చెబుతున్నారని వాపోయాడు. కాలు, చేయి పడిపోయినా పింఛన్‌ ఇవ్వడం లేదని ఒకరు, మడమ కురుపు వ్యాధితో బాధపడుతున్నా ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్‌ చేయం అంటున్నారని ఇంకొకరు.. ఇలా ఈ ఒక్క గ్రామం దాటేసరికే ఏడుగురు వారి సమస్యలను జగన్‌కు నివేదించారు.

వీరందరి కష్టాలు వింటూ చలించిపోయిన జగన్‌.. ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ఆరోగ్యశ్రీని పటిష్టం చేస్తామన్నారు. పింఛన్లు ఎందుకు రావడం లేదో కనుక్కోవాలని తన సహాయకులకు సూచించారు.  

జీతం పెంచుతామని చెప్పి పట్టించుకోలేదన్నా..
ఎన్నికలకు ముందు చంద్రబాబు తమ సర్వీసులను రెగ్యులరైజ్‌ చేస్తామని, కనీస వేతనం పెంచుతామని హామీ ఇచ్చి.. గెలిచిన తర్వాత పట్టించుకోలేదని ఆశ వర్కర్లు జగన్‌ ఎదుట వాపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఆశ వర్కర్లకు రూ.6 వేలు ఇస్తుంటే ఇక్కడ తమకు అందులో సగం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

కామవరపుకోట మండలం ఈస్ట్‌ ఎడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ అనే ఎస్సీ కౌలు రైతు వ్యవసాయం గిట్టుబాటు కాక ఏడాది కిందట చనిపోయినా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆ రైతు భార్య హేమలత జగన్‌కు ఫిర్యాదు చేసింది. చంద్రన్న బీమా కూడా రాలేదని కన్నీటి పర్యంతమైంది. పెరుగుగూడెం గ్రామానికి చెందిన కొత్తూరి నాగేశ్వరమ్మ వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నప్పటికీ జననేతను చూడాలని ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చుంది. జగన్‌ రాగానే.. ‘బిడ్డా నిన్ను చూస్తానో.. చూడలేనో అనుకున్నా.. చూశాను. చాలా సంతోషంగా ఉంది. మీ అభీష్టం నెరవేరుతుంది’ అని చెప్పింది. విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలంటూ జగన్‌ ఆమెకు జాగ్రత్తలు చెప్పి ముందుకు సాగారు.

ముదిరాజులకూ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండి  
రూ.వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ముదిరాజుల సంఘం ప్రతినిధులు చొప్పిడి కృష్ణమోహన్, చుక్కా శ్రీనివాస్‌లు వైఎస్‌ జగన్‌ను కోరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని, ప్రభుత్వ పథకాలేవీ తమకు అందడం లేదని వివరించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమను బీసీ–ఎ క్యాటగిరీలో చేరుస్తూ జీవో నెంబర్‌ 15 ఇస్తే కొందరు కోర్టుకు వెళ్లి దాన్ని రద్దు చేయించారని, ప్రస్తుతం తాము బీసీ–బిలో ఉన్నామన్నారు. తమకు గిట్టుబాటు ధర రావడం లేదని రాజా పంగిడిగూడెం సమీపంలో వర్జీనియా పొగాకు రైతులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తే తాము ఏర్పాటు చేసుకున్న బ్యారన్లు తీసేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top