పాదయాత్రలో మరో మైలురాయి
1200 కిలోమీటర్లు పూర్తి చేసిన వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ ఒక మొక్కను నాటారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతకుముందు లింగసముద్రం మండలం కొత్తపేట గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రకాశం జిల్లాలోకి ఆయన ప్రవేశించారు. రాజన్న తనయుడికి ఎదురేగి ప్రకాశం జిల్లా వాసులు ఆత్మీయ స్వాగతం పలికారు.
నెల్లూరు జిల్లాలో ముగిసిన యాత్ర
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాలో 20 రోజుల పాటు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రలో జగన్ 266.5 కిలోమీటర్లు నడిచారు.
రామకృష్ణాపురంలో మొక్క నాటుతున్న వైఎస్ జగన్