‘ఏపీలో బలమైన నాయకుడు వైఎస్ జగనే’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో బలమైన నాయకుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వైఎస్సార్ మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపుల వల్లే వైఎస్ జగన్పై కేసులొచ్చాయని పేర్కొన్నారు. ఆయనపై ఉన్న కేసులేవి నిరూపితం కాలేదని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాకే వైఎస్ జగన్పై కేసులొచ్చాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వైఎస్ జగన్ లాంటి గొప్పనాయకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్లను సమర్థిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాపు రిజర్వేషన్లపై చర్చిస్తానని అథవాలే వెల్లడించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నుంచి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బయటకు రావడం తొందరపాటు నిర్ణయమని అన్నారు.