29వ రోజు పాదయాత్ర డైరీ

Ys jagan mohanreddy 29th day dairy - Sakshi

07–12–2017, గురువారం
పాపినేనిపాళ్యం, అనంతపురం జిల్లా

శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి

ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర 400 కిలోమీటర్లు దాటింది. నెల రోజులు పూర్తి చేసుకుంది, నేను కోర్టుకు వెళ్లిన కొద్ది రోజులు తప్ప.. మిగతా రోజులు పల్లె దారుల్లో, ప్రజల మధ్య ఎంత త్వరగా గడిచిపోయాయో! ఉదయం లేచినప్పటి నుంచి, రాత్రి విశ్రమించే దాకా సమయం ఎలా గడుస్తోందో తెలియడం లేదు.. అనుక్షణం ప్రజల మధ్యే. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, అభిమానం, ప్రేమ, నాపై ఉంచిన నమ్మకం, వారి కష్టాలను తీర్చాలన్న కసి, కన్నీళ్లను తుడవాలన్న సంకల్పమే నన్ను నడిపిస్తున్నాయి.

ఈ రోజు పాదయాత్రలో గుమ్మేపల్లిలో కుమ్మరి యువసేన నేతలు కలిశారు. తమ కుల వృత్తి అంతరించిపోతోందని, చేయూతనిచ్చి కాపాడాలన్నారు. తమకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. వారి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఫెడరేషన్‌ ద్వారా అందాల్సిన రుణాలు కూడా సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఫెడరేషన్లు ఎలా పని చేస్తున్నాయో నాకర్థ్ధమైంది. ఈ ప్రభుత్వ పాలనలో మోసపోని సామాజికవర్గమంటూ ఉందా?

ఏ ప్రభుత్వ పనితీరునైనా సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను చూసి బేరీజు వెయ్యవచ్చు. కానీ ఏ ఒక్క అంశంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదని పాదయాత్రలో స్పష్టమవుతోంది. సులభంగా తీర్చగలిగే చిన్న, చిన్న సమస్యలను కూడా పరిష్కరించకపోవడం మనసుకు చాలా బాధ కలిగిస్తోంది. ప్రభుత్వం సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ సమదృష్టితో అందించాలి. అప్పుడే అది ప్రజా ప్రభుత్వమవుతుంది. నన్ను కలిసి బాధలు చెప్పుకున్న ప్రతి ఒక్కరూ నాన్నగారి హయాంలో తరతమ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయని, ఇప్పుడా పరిస్థితి లేదని బాధతో చెప్పారు. అలాంటి పాలన మళ్లీ రావాలని ఆకాంక్షించారు. దీన్నిబట్టి నిష్పక్షపాతంగా పాలన సాగిస్తే ఆ నాయకుడిని, ఆ పాలనను ప్రజలు ఎంతగా ఆదరిస్తారో నాకర్థమైంది. నాన్నగారి పాలనను మళ్లీ తీసుకురావాలనే సంకల్పం మరింత బలపడింది.

ఇక అభివృద్ధి విషయానికి వస్తే ఆ ఛాయలే కనపడకపోగా, అభివృద్ధి తిరోగమనంలో ఉంది. రాష్ట్ర ఆర్థిక వనరులను, సహజ సంపదలతో సహా దేనినీ వదలకుండా ప్రభుత్వ పెద్దలే స్వాహా చేస్తుంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. అసలు రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా అన్న సందేహం వస్తోంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా పొలిటికల్‌ బాస్‌లకు సలాం కొడుతూ గులాంగిరీ చేస్తున్నట్లు అనిపిస్తోంది. గత రెండు వారాలుగా తాడిపత్రి నియోజకవర్గం అప్పేచర్లలో మా పార్టీ నాయకుడి హత్యకేసులో సాక్షులుగా ఉన్న హతుడి కుటుంబ సభ్యులను, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పోలీస్‌ పికెట్‌ ఉన్న గ్రామంలోనే అధికార పార్టీ నేతలు నిత్యం దాడులకు తెగిస్తున్నారంటే అక్కడ శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. నిన్న ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను దారుణంగా చంపేశారు. పది రోజుల క్రితం రాప్తాడు నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన మరో నేతను చంపేందుకు కుట్ర పన్నితే అదృష్టవశాత్తూ అతను తప్పించుకోగలిగాడు.

ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల గళం నొక్కడానికి, అధికార పార్టీ కార్యకర్తలకు వత్తాసు పలకడానికి, ప్రతిపక్ష కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడానికే వినియోగిస్తోంటే ఇక శాంతిభద్రతలకు అవకాశం ఎక్కడుంటుంది? ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత లేదు.. రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు.

చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదొక ప్రశ్న.. నేను జిల్లాలో ఉండగానే మా కార్యకర్తలు హత్యకు గురవుతున్నారంటే హంతకులకు ప్రభుత్వ భరోసా ఏ స్థాయిలో ఉండి ఉండాలి? అనంతపురం జిల్లాలో గత మూడున్నర సంవత్సరాలలో మా పార్టీ కార్యకర్తలు ఎనిమిది మంది దారుణహత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా చాలా మందిని పొట్టనపెట్టుకున్నారు. అవన్నీ మీ రాజకీయ హత్యలు కావా? ఇలాంటి సంస్కృతిని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తే భావితరాల భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒక్కసారైనా ఆలోచించారా?

కల్లుమడి గ్రామంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తున్న వృద్ధురాలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top