మీ రాజకీయ జీవితంలో ఒక్క ఉద్యమం చేశారా?
సాక్షి, పెద్దాపురం : దేశంలోనే అందరి కంటే సీనియర్ నేతని తానేనని, అందరి కంటే తనకు ఎక్కువ విషయాలు తెలుసునని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరచూ గొప్పలు చెప్పుకుంటారన్న విషయం తెలిసిందే. అంతా తెలుసునని చెప్పుకునే చంద్రబాబుకు ఢిల్లీలో ఎలాంటి విలువ ఉందో కూడా లోక్సభలో మొన్నటి అవిశ్వాస తీర్మానం చర్చలో బట్టబయలైంది. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం ఓ తపస్సుగా భావించి ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తోన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ సూటిప్రశ్న సంధించారు. ‘చంద్రబాబుగారూ.. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటం కాని, ఒక ఉద్యమంకాని ఎప్పుడైనా చేశారా’అని వైఎస్ జగన్ ట్విటర్లో ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే రాజన్న తనయుడు వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ ఏపీ సీఎంను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్ లాంటి ఏపీకి ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో అంశాలపై వైఎస్సార్సీపీ నేతలు పోరాడుతుండగా.. అధికారంలో ఉండి ప్రతి విషయంలో వెనుకంజ వేస్తున్న చంద్రబాబును పలుమార్లు జననేత వైఎస్ జగన్ ఎండగట్టారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో సాధించానని చెప్పుకునే చంద్రబాబు.. ప్రపంచంలో ఏం జరిగినా అది ఘనతగానే ప్రచారం చేసుకోవడంలో దిట్ట అని ఇప్పటికే విమర్శల పాలవుతున్నారు. అంత అనుభవం ఉన్న నేత గత నాలుగేళ్లు ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ చెట్టాపట్టాలేసుకుని ఎందుకు తిరిగారంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలైనా ఐదుగురు ఎంపీలు తమ పదవులను తృణప్రాణంగా ప్రత్యేక హోదా కోసం వదిలేసి ఆమరణ నిరాహార దీక్ష చేయగా, బాధ్యత గల సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఏపీ కోసం చేశారో చెప్పాలని వైఎస్ జగన్ పలుమార్లు డిమాండ్ చేశారు.
చంద్రబాబుగారూ @ncbn .. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటంకాని, ఒక ఉద్యమంకాని ఎప్పుడైనా చేశారా?
— YS Jagan Mohan Reddy (@ysjagan) 22 July 2018