చెంతకే వస్తున్న చింత తీర్చే నేత
సాక్షిప్రతినిధి, విజయనగరం : అందరిదీ ఒక్కటే లక్ష్యం. ఆయన్ను చూడాలి... తమ బాధలు చెప్పుకోవాలని ఆపన్నుల ఆరాటం. అభిమాన నాయకునితో కరచాలనం చేయా లి... సెల్ఫీలు తీసుకోవాలని అక్కచెల్లెమ్మలు, యువతీ యువకుల ఉబలాటం. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఆసక్తిగా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఓపికగా అం దరితోనూ మాట్లాడుతున్నారు. గుండె నిబ్బరంతో భరోసా కల్పిస్తున్నారు. అందుకే ఆ ప్రజాసంకల్పయాత్రకు జనం పోటెత్తుతున్నారు. అడుగడుగునా ఘన నీరాజనం పలుకుతున్నారు. ఆయన రాకతో విశాఖ–రాయపూర్ అంతరాష్ట్ర రహదారిపై శనివారం పండగ వాతావరణం నెలకొంది.
విజయాలనందించే విజయదశమిని జిల్లా ప్రజలంతా శుక్రవారమే జరుపుకున్నా బొబ్బిలి మండలంలోని పల్లెల్లో శనివారమూ ఆ సందడి కొనసాగింది. బహుదూరపు బాటసారిని చూడాలని గంటల తరబడి ఎదురుచూశారు. ఆయన కనిపించగానే... జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, విద్యార్థులు, యువత, పసి పిల్లల తల్లులు అభిమాన నాయకుడిని కలిసేందుకు పోటీ పడ్డారు. చంటి పిల్లలను అప్యాయంగా ముద్డాడి దీవించిన జగనన్న ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు చేపట్టే పాదయాత్రలో కష్టాన్ని చూసి 70 ఏళ్ల వృద్ధుడు అభిమానంతో ఆయనకు గొడుగు పట్టడం విశేషం.
బొబ్బిలి మండలంలో జన జాతర
అభిమాన నాయకుడు, కష్టాలు తీర్చే ధీరుడు తమ వద్దకు వస్తున్నాడన్న సమాచారంతో బొబ్బిలి మండలంలో పలు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా విశాఖ –రాయపూర్ అంతరాష్ట్ర రహదారిపై పాదయాత్ర కొనసాగించిన జననేతకు ప్రజలు ఘన నీరాజనాలు పలికారు. శనివారం ఉదయం బొబ్బిలి పట్టణ శివారున గల శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభించిన జననేత జగన్మోహన్రెడ్డి ఇందిరమ్మకాలనీ, పోలవానివలస, మెట్టవలస మీదుగా మెట్టవలస క్రాస్ వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం భోజరాజపురం క్రాస్, సీతారాంపురం, పారాది మీదుగా పారాది క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి శిబిరం వద్దకు చేరుకుంది. మెట్టవలస వద్ద పలువురు చిన్నారులు కావాలి జగన్.. రావాలి జగన్.. అన్న అక్షరాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు.
జగనన్నా మా కష్టం తీర్చన్నా...
పాదయాత్రలో జననేతను కలిసిన వరలక్ష్మి, కృష్ణారావు దం పతులు వైఎస్సార్ హయాంలో మంజూరైన ఇంటిని కూతురి పెళ్లికోసం అమ్ముకోవాల్సి వచ్చిందని, ఏ ఆధారం లేని తమ కు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని చెప్పారు. మెట్టవలస వద్ద పల్ల సత్యారావు రుణమాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, రూ. 30వేలు రుణం తీసుకుంటే రూ. 27 వేలు మాఫీ అయినట్టు రుణ విమోచన పత్రం ఇచ్చినా... ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని వడ్డీతో సహా రూ.58,400లు చెల్లించాలంటూ బ్యాంక్ నోటీసులు జారీ చేసిందని మొరపెట్టుకున్నాడు. సమాన పనికి సమాన వేతనం చెల్లించటంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్శాఖ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ నిర్మాణానికి భూములు ఇచ్చిన తమకు ఉపాధి కల్పిస్తామన్నారనీ, కానీ అది అమలు కాలేదని పలువురు వాపోయారు.
పాదయాత్రలో జగన్ దళం
పాదయాత్రలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, మోపిదేవి వెంకటరమణ, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, సాలూరు, రాజాం, పా లకొండ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, విజయనగరం జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్రాజ్, బొబ్బిలి, నరసన్నపేట, పాతపట్నం, పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, ధర్మాన కష్ణదాస్, రెడ్డి శాంతి, సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, పిరియా సాయిరాజు, రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, గుంటూరు జిల్లా నేతలు రజని, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.