వైఎస్ జగన్ కీలక సమావేశం
సాక్షి, నెల్లూరు: కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చించేందుకు తమ పార్టీ ముఖ్యనాయకులతో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో వైఎస్ జగన్ పాదయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరుగుతోంది.
ఈ భేటీకి వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, ఎంపీలు ప్రాంతీయ సమన్వయకర్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రత్యేక హోదా సాధన కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సాగిస్తున్న నాటకాలను ప్రజలకు వివరించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలనేదానిపై కూడా చర్చిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.