ప్రత్యేక హోదా యువతతోనే సాధ్యం
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి
బంద్కు జననేత సంఘీభావం
ఇంజినీరింగ్ విద్యార్థులతో మమేకం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఆత్మకూరు: అన్యాయంగా విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే ఊపిరి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఏఎస్పేట మండలం జువ్వలగుంటపల్లి శివార్లలో శిబిరం వద్ద గురువారం కావలికి చెందిన ఆరెస్సార్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాలు నిర్వహిస్తున్న బంద్కు సంఘీభావం వ్యక్తం చేసి ప్లకార్డులు చేతబట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాడుతున్న జగన్మోహన్రెడ్డికి తాము అండగా ఉంటామని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో మమేకమై పలకరించారు. యువత ముందుండి పోరాడితే ప్రత్యేక హోదా సాధించడం కష్టం కాదన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడతాయని, కష్టపడి చదివిన విద్యార్థుల చదువు సార్థకమయ్యేలా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. తమ పోరాటానికి ముందుకొచ్చే ప్రతి ఒక్కర్నీ కలుపుకొని సాగుతానని తెలిపారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
హోదాతో అన్ని చేకూరుతాయి
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతోనే అన్ని సమకూరుతాయి. గతంలో విడిపోయిన ఉత్తరాఖండ్లో ప్రత్యేక హోదాతో ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి. అనేక వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలు చేస్తే వందలాదిగా పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగావకాశాలు, పలువురికి ఉపాధి లభించి రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది.-సాయివీణ, ఇంజినీరింగ్ విద్యార్థి
మాట తప్పడం దారుణం
గత ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు ప్రత్యేక హోదా విషయమై హామీలి చ్చి మాట తప్పడం దారు ణం. తిరుపతిలో బహిరంగ సభలో రాష్ట్రానికి పదేళ్ల పా టు కావాలని పేర్కొన్న వారు అధికారంలోకి వచ్చి దాని ఊసెత్తకుండా ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసేందుకు పూనుకోవడం దారుణం.- హరికృష్ణ, ఇంజినీరింగ్ విద్యార్థి
ఉపాధి లభిస్తుంది
ప్రత్యేక హోదా వస్తే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు ఎక్కువగా ఏర్పడతాయి. రైతులకు వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. కేంద్రం ఆ దిశగా ఆలోచించకుండా ప్రత్యేక ప్యాకేజీతో సరి పెట్టుకోవాలని చూస్తూ ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను మరిచి ప్రజలను మోసం చేశాయి. -వెంగమ్మ, ఇంజినీరింగ్ విద్యార్థి