అబద్ధాల బాబును నమ్మొద్దు
రావాలి జగన్–కావాలి జగన్
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు
కడప కార్పొరేషన్: ఎన్నికల ముందు అనేక అబద్ధాలు వల్లించి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ఇకపై నమ్మవద్దని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కోరారు. మంగళవారం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, రైల్వేకోడూరు నియోజక వర్గాల్లో పార్టీ నేతలు ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయంటూ భరోసా కల్పించారు.
కడప నగరంలోని 6వ డివిజన్ నెహ్రూనగర్లో కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు, ఎమ్మెల్యే అంజద్బాషా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండల కేంద్రంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల గురించి వివరించారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటలోని లక్ష్మిగారి పల్లె, అబ్బినాయుడు పల్లెల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేసిన వంచనను తెలిపారు. రాజంపేట పట్టణంలోని బూత్ నంబర్ 139లో అమ్మవారిశాల వీధి, జాలీబజార్, బాండ్రాల వీధుల్లో రాజంపేట పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు ప్రజలను కలుసుకుని హామీల అమలులో ప్రభుత్వం చేసిన మోసాలను వివరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని 9వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజలను కలుసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే చేయబోయే కార్యక్రమాలను తెలియజేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం అక్కల్రెడ్డిపల్లెలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, పార్టీ నాయకులు ప్రజలను కలుసుకుని నవరత్నాల ఉపయోగాలను వివరించారు.