అక్కడ యోగికి మాత్రమే ఎంట్రీ...
ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతితో భేటీ
ఇతర బీజేపీ నేతలకు అనుమతి లేదు
సాక్షి, బెంగళూరు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నగరంలో పర్యటించనున్నారు. విజయనగర నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించనున్న పరివర్తనా యాత్రలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఇదే సందర్భంలో ఆయన సమావేశం అనంతరం ఆదిచుంచనగిరి మఠానికి వెళ్లనున్నారు.
దాదాపు గంటన్నర సమయం యోగి ఆదిత్యనాథ్ ఆదిచుంచనగిరి మఠంలో ఉండడంతో పాటు, పీఠాధిపతి నిర్మలానంద స్వామీజీతో కలిసి భోజనం చేయనున్నారు. అంతేకాకుండా నిర్మలానంద స్వామీజీతో యోగి ఆదిత్యనాథ్ ఆంతరంగిక చర్చలు జరపనున్నట్లు సమాచారం. అయితే యోగి ఆదిత్యనాథ్ భేటీ సమయంలో మరే ఇతర బీజేపీ నేతలను కూడా మఠంలోనికి అనుమతించరాదని మఠం పాలక మండలి నిర్ణయించినట్లు సమాచారం.
గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదిచుంచనగిరి మఠానికి వెళ్లిన సమయంలో, పీఠాధిపతి నిర్మలానంద స్వామీజీని అగౌరవ పరిచేలా వ్యవహరించారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ భేటీ సమయంలో మరే ఇతర బీజేపీ నేతలను మఠంలోనికి అనుమతించరాదన్న నిర్ణయాన్ని పాలక మండలి తీసుకున్నట్లు సమాచారం.