మోదీపై యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్.. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, మిత్రపక్ష ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం వెదుక్కుంటారంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలు.. మోదీని ఎన్నుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన పాలన పట్ల వారు సంతోషంగా లేరు. యోగి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మేము(బీజేపీ, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) ప్రభుత్వం ఏర్పాటు చేశామని ఛాతీ విరుచుని చెప్పుకుంటున్నాం. కానీ అది ఎస్పీ, బీఎస్పీల వల్లే సాధ్యమైంది. మేము ప్రజలకు ఏం మంచి చేశామని వాళ్లు మాకు మళ్లీ ఓట్లేస్తారంటూ’ వ్యాఖ్యానించారు.
కాగా సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత అయిన రాజ్భర్.. రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ యోగి పాలనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ సంకీర్ణ ధర్మం పాటించడం లేదు. ఎల్లప్పుడూ వారికి అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం గురించి గొప్పలు చెప్పుకోవడం మాత్రమే తెలుసు. ప్రజాసంక్షేమం కన్నా గుళ్లూ గోపురాలపైనే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కువ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినప్పటికీ అవినీతి ఏమాత్రం తగ్గలేదు’ అంటూ వ్యాఖ్యానించడం ద్వారా యోగి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన విషయం తెలిసిందే.