‘అవినీతి, అబద్దాలు చెప్పడంలో లోకేశ్కు టార్గెట్లు’
చంద్రబాబు విదేశి పర్యటనలతో ఒరిగిందేమి లేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు విదేశి పర్యటనలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు 25 పర్యటనలు చేసిన చంద్రబాబు ఓ నాలుగు పర్యటనలతో సాధించింది ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ పర్యటనల ద్వారా ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంత మందికి ఉపాధి దొరికిందో తెలపాలని నిలదీశారు.
చంద్రబాబు ఇక్కడే అబద్దాలు ఆడుతాడని అనుకున్నామని, కానీ ఆయన విదేశాల్లో కూడా అబద్దాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్లో అమరావతిని అత్యద్బుత నగరంగా చూపించారని, సేంద్రీయ వ్యవసాయం జరుగుతోందని కలరిచ్చారని ధ్వజమెత్తారు. విదేశీ వేదికపై చంద్రబాబు సొంత ప్రచారం చేసుకుంటున్నారని, భూమలు ఇస్తామని ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి సొమ్ము అని ఆయన ఆ ఆఫరిస్తున్నాడని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పడం, అవినీతి సంపాదన విషయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్కు టార్గెట్ పెట్టినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ట్వీట్స్ చూస్తే అదే అర్ధమవుతోందన్నారు.